Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఏఏ, ఎన్నార్సీలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దు
- పలు షరతులు విధించిన న్యాయస్థానం
న్యూఢిల్లీ : లాక్డౌన్ను ధిక్కరించి ఢిల్లీలోని షాహీన్బాగ్లో నిరసనల్లో పాల్గొన్న ముగ్గురు నిరసనకారులకు ఢిల్లీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అదే సందర్భంలో వీరికి కొన్ని షరతులు సైతం విధించింది. కాగా, ఈ ముగ్గురికి బెయిల్ మంజూరు చేయడాన్ని కేంద్రం వ్యతిరేకించింది. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను ప్రకటించి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కర్ఫ్యూ అమలులో ఉన్నప్పటికీ ఆదేశాలను ధిక్కరిస్తూ ఆముగ్గురు నిరసనకారులు షాహీన్బాగ్కు రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ ముగ్గురు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై ఢిల్లీ న్యాయస్థానం సోమవారం నాడు విచారణ జరిపింది. సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఇటీవల జారీ చేసిన ఆదేశాలకనుగుణంగా ఆ ముగ్గురికి బెయిల్ ఇస్తున్నట్టు న్యాయస్థానం తెలిపింది. అయితే ఏవైనా నిరసనల పేరుతో షాహీన్బాగ్ను ఈ ముగ్గురు సందర్శించకూడదని నిబంధన పెట్టింది. అలాగే సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లకు సంబంధించి తమ భావాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయవద్దని ఆదేశించింది.
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ఎలాంటి ఇంటర్వ్యూలూ ఇవ్వద్దని తెలిపింది. దర్యాప్తు కాలంలో ప్రతి సోమవారం క్రమం తప్పకుండా ఉదయం పది గంటలకు షాహీన్బాగ్ పోలీసు స్టేషన్లో హాజరు వేయించుకోవాలని న్యాయస్థానం సూచించింది. రూ. 25 వేల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు, ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని కోర్టు ఆ ముగ్గురుని ఆదేశించింది. అయితే ఈ ముగ్గురు భవిష్యత్తులో షాహీన్బాగ్ నిరసన ప్రదేశం వద్ద గుంపులుగా జనాలను సమీకరించే అవకాశం ఉన్నదని బెయిల్ను కేంద్రం వ్యతిరేకించింది.