Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీహార్లో బాలుడు మృతి
- కర్ఫ్యూతో రేషన్ కరువు
పాట్నా : ముందస్తు ప్రణాళిక లేకుండా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు మరో చిన్నారి బలయ్యాడు. బీహార్లోని భోజ్పూర్ జిల్లా అర్హ్ర గ్రామానికి చెందిన రాకేశ్ అనే ఎనిమిదేండ్ల బాలుడు ఆకలికి తాళలేక రెండ్రోజుల క్రితం చనిపోయాడు. కర్ఫ్యూ కారణంగా పనులు లేక, రేషన్ దొరక్క తమ కొడుకు ప్రాణాలు కోల్పోయాడని అతడి తల్లిదండ్రులు వాపోతున్నారు. వివరాల్లోకెళ్తే.. ముషాహర్ కమ్యూనిటికి చెందిన దుర్గా ప్రసాద్ కొడుకు రాకేశ్. దినసరి కూలీగా పనిచేస్తున్న ప్రసాద్కు కేంద్రం విధించిన దేశవ్యాప్త మూసివేతతో పని కరువైంది. దీంతో రెక్కాడితే గానీ డొక్కాడని అతడి కుటుంబం.. దాదాపు వారం రోజులుగా పస్తులుం టున్నది. ఇంట్లో పెద్దవాళ్లు ఆకలికి ఓర్చుకున్నా.. చిన్న పిల్లలు మాత్రం తట్టుకోలేకపోయారు. అంతేగాక రాకేష్ ఇప్పటికే జ్వరంతో బాధప డుతున్నాడు. దానికి ఆకలి కూడా తోడవడంతో ఆ బాలుడు శనివారం ప్రాణాలు విడిచాడు. దీనిపై రాకేశ్ తల్లి సొనామతి మాట్లాడుతూ... 'కర్ఫ్యూ ప్రారంభమైనప్పటి నుంచి మేం పస్తులుం టున్నాం. అంతకు ముందు నా భర్త రోజుకు రూ. 200 సంపాదించి తెస్తే దానితో సరుకులు తెచ్చుకునేవాళ్లం. కానీ కర్ఫ్యూ నేపథ్యంలో గడిచిన పది రోజులుగా పనులేమీ దొరకడం లేదు. రేషన్ కోసం షాపులకు వెళ్దామన్నా అవీ మూసే ఉన్నాయి. నాలుగు రోజుల నుంచి ఇంట్లో సరుకులేమీ లేవు. అంతేగాక రాకేశ్ నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. దీనికి ఆకలి కూడా తోడవడంతో అతడు మరింత నీరసానికి గురయ్యాడు. మార్చి 26న రాకేశ్ను ఆస్పత్రికి తీసుకెళ్తే.. డాక్టర్ కొన్ని మందులు రాశాడు. మాకు తెలిసినవారి దగ్గర అప్పు తీసుకొచ్చి మందులు కొనుక్కొచ్చాం. కానీ, అవి వేసుకోకుండానే నా కొడుకు చనిపోయాడు' అంటూ కన్నీరుమున్నీరైంది.