Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : లాక్డౌన్ నేపథ్యంలో పాల ఎగుమతులు కేరళకు పెద్ద తలనొప్పిగా మారాయి. కేరళ నుంచి పాలను స్వీకరించేందుకు తమిళనాడు అంగీకరించకపోవడంతో పాల సేకరణ దెబ్బతినే అవకాశాలు కన్పిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వంతో చర్చించాలని కేరళ కార్పొరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (మిల్మా) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. లాక్డౌన్ నేపథ్యంలో పాల అమ్మకాలు తగ్గిపోవడం వల్ల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మిల్మాకు చెందిన మలాబార్ రీజియన్ కార్పొరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ (ఎంఆర్సీఏంపీయూ)... అమ్ముడుకాని పాలను తమిళనాడులోని సహకార, ప్రయివేటు ప్లాంట్లలో పెద్ద మొత్తంలో పాల పొడిగా మారుస్తున్నది. మంగళవారం నాటికి ఈ సమస్యను పరిష్కరించకపోతే ఉత్తర కేరళ జిల్లాల్లో పాల సేకరణను తాత్కాలికంగా మిల్మా నిలిపివేసే అవకాశాలున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. రోజువారీ 6 లక్షల లీటర్ల పాల సేకరణ చేపడుతుండగా.. 2.5 లక్షలకు అమ్మకాలు పడిపోయాయనీ, అమ్ముడు పోని పాలను తమిళనాడులో పొడిగా మారుస్తున్నామని ఎంఆర్సీఏంపీయూ మేనేజింగ్ డైరెక్టర్ విజరు కుమరన్ తెలిపారు. కేరళ నుంచి పాలు సేకరించవద్దని తమిళనాడు ఆరోగ్య శాఖా విభాగం ఆదేశాలు జారీ చేసినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు.