Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సెన్సెక్స్ 1375 పాయింట్ల పతనం
- మళ్లీ కరోనా నష్టాలు
ముంబయి : కరోనా భయాలు, ప్రపంచ మార్కెట్ల క్షీణత, మాంద్యం భయాలతో దలాల్ స్ట్రీట్ మరోమారు భారీ నష్టాలను చవి చూసింది. వరుసగా నాలుగు సెషన్లలో లాభపడిన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం తిరిగి నష్టాలతో ముగిశాయి. ప్రపంచ దేశాల్లో కరోనా మరణ మృదంగం కొనసాగడంతో మదుపర్లు ఆందోళనకు గురైయ్యారు. రోజంతా నేల చూపులు చూడగా.. తుదకు బీఎస్ఈ సెన్సెక్స్ 1375 పాయింట్లు లేదా 4.61 శాతం కోల్పోయి 28,441కు పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 379 పాయింట్లు లేదా 4.28 శాతం క్షీణించి 8,281 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 28,291 కనిష్ట స్థాయిని నమోదు చేసింది. ఒక్క సెషన్లోనే బీఎస్ఈలో మదుపర్లు రూ.2.85 లక్షల కోట్లు నష్టపోయారు. భారత మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపర్లు భారీగా ఈక్విటీలను తరలించుకుపోతున్నారు. దీంతో ఈ నెలలో ఇప్పటి వరకు దాదాపుగా రూ.59,377 కోట్ల షేర్లను ఉపసంహరించుకున్నారు. నిఫ్టీలో ప్రధానంగా రియల్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఆటో రంగాలు 8-5 శాతం మధ్య పడిపోయాయి. ఈ బాటలో మీడియా, లోహ, ఐటీ సూచీలు 3.4-2 శాతం మధ్య క్షీణించాయి. కాగా ఫార్మా 1.4 శాతం, ఎఫ్ఎంసీజీ 0.7 శాతం చొప్పున మాత్రం పెరిగాయి.