Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
- విచారణ నేటికి వాయిదా
న్యూఢిల్లీ : లాక్డౌన్ నేపథ్యంలో స్వస్థలాలకు భారీగా తరలివెళ్తున్న వలసకార్మికుల విషయంలో తీసుకుంటున్న చర్యలపై తక్షణమే నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను మంగళవారానికి వాయిదావేసింది. వలసకార్మికులకు తీసుకున్న సహాయ చర్యలపై న్యాయవాదులు అలఖ్ అలోక్ శ్రీవాస్తవ, రష్మీ బన్సాలీ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ.బోబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వర రావుతో కూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం విచారణ జరిపి పై ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే చర్యలు చేపడుతున్న కేంద్రానికి ఈ తరుణంలో మార్గదర్శకాలు జారీ చేసి మరింత గందరగోళం సృష్టించే ఉద్దేశం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అలాగే కరోనా వైరస్ కంటే కార్మికుల వలసలే పెద్ద సమస్యగా పరిణమిస్తున్నదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వైరస్ వ్యాస్తిని నిలువరించేందుకే వలసలను ఆపాల్సి వస్తున్నదని ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుఫార్ మెహతా కోర్టుకు తెలిపారు. వలస కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కేంద్రం, సంబంధిత రాష్ట్రాలతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రోడ్లపై నిలిచిపోయిన వారిని, కాలిబాటన వెళుతున్నవారిని వెంటనే గుర్తించి, వారిని సమీప ప్రభుత్వ షెల్టర్ హౌమ్లకు తరలించాలని పిటిషన్దారులు కోరారు. వారికి ఆహారం, తాగునీరు, వైద్య వసతులు కల్పించేందుకు తక్షణం చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. కాగా, మార్గదర్శకాల జారీకి ముందు.. కేంద్ర నివేదిక వచ్చేవరకూ వేచి చూస్తామని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. 'ప్రభుత్వ అఫిడవిట్ సమర్పించిన తర్వాత.. ఈ పిటిషన్పై విచారిస్తాం' అని బోబ్డే వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రకటించిన 21 రోజుల లాక్డౌన్ నేపథ్యంలో కుటుంబాలతో సహా భారీ సంఖ్యలో వసల కార్మికులు రాష్ట్రాల సరిహద్దుల వద్ద తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. అలాగే అంతర్రాష్ట్ర రహదారుల వెంట కాలిబాట పట్టారు. తినడానికి తిండి కూడా దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకూ దాదాపు 22 మంది మరణించినట్టు వార్తలొస్తున్నప్పటికీ, వాస్తవ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటున్నట్టు సామాజిక కార్యకర్తలు అంచనా.