Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆత్మహత్యల నేపథ్యంలో కేరళ సర్కారు తాజా ఆదేశాలు
తిరువనంతపురం : లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం లభించక రోజురోజుకూ పెరిగిపోతున్న ఆత్మహత్యలను దృష్టిలో ఉంచుకొని కేరళ సర్కారు చర్యలకు ఉపక్రమించింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్న వారికే మద్యం అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ విభాగానికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఉపసంహరణ లక్షణాలు ఉన్నవారికి సరైన చికిత్సను అందించాలని తెలిపింది. రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూతపడటంతో ఆన్లైన్లో లిక్కర్ అమ్మకాల పైనా కేరళ సర్కారు పరిశీలిస్తున్నది. మద్యం లభించని కారణంగా సామాజిక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నదనీ, డాక్టర్ల నుంచి ప్రిస్క్రిప్షన్ ఉన్నవారికి లిక్కర్ను అందుబాటులోకి తీసుకురావాలని ఎక్సైజ్ విభాగాన్ని ఆదేశించినట్టు కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. అలాగే ప్రజలను డీ-అడిక్షన్ కేంద్రాల్లో చేర్పించాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మద్యం లభించకపోవడంతో శుక్రవారం కేరళలో ఇద్దరు, శనివారం నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.