Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వినియోగం పెరగాలంటూ.. అధికారిక పత్రంలో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ : మరోసారి హిందీ వివాదం తెరపైకొచ్చింది. కేంద్ర కార్యాలయాలు, ప్రభుత్వ బ్యాంకులు, అనుబంధ సంస్థలో ప్రమోషన్లు, అధికారిక వ్యవహారాల నిమిత్తం వినియోగించే హిందీ భాషపై కేంద్రం విడుదల చేసిన అధికార పత్రం.. ఇప్పుడు హిందీయేతర రాష్ట్రాల్లో నిప్పురాజేసింది. అధికారిక వ్యవహారాల్లో హిందీ భాషను అవసరమైన మేరకు వినియోగించుకోవడం లేదంటూ కేంద్రం కన్నీరుకారుస్తోంది. హిందీలో కొంత పురోగతి సాధించినప్పటికీ.. వార్షిక కేంద్ర అధికారిక వ్యవహారాలన్నీ ఆంగ్లంలోనే కొనసాగుతున్నాయని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక భాషా విభాగం ఓ డాక్యుమెంట్లో పేర్కొంది. అయితే మరింత లక్ష్యాలు సాధించాల్సి ఉందని తెలిపింది. పౌర సేవకులకు ఇతర విషయాలతో పాటు హిందీ కోర్సులో కూడా తప్పనిసరి శిక్షణ ఇస్తున్నట్టు పేర్కొంది. కానీ, వారంతా అధికారిక కార్యకలాపాల్లో వినియోగించడం లేదనీ...దీని వల్ల అధికారులు సరైన సందేశం పొందలేకపోతున్నారంటూ తెలిపింది. అధికారిక హిందీని కార్యకలాపాల్లో వినియోగించడం రాజ్యంగబద్ధమైన బాధ్యత అనీ, దీని వల్ల కింది స్థాయి ఉద్యోగులు కూడా ప్రేరణ పొందే అవకాశం ఉందన్నారు. అయితే కేంద్రం ఇలా పేర్కొనడంపై పశ్చిమబెంగాల్, తమిళనాడుతో పాటు పలు హిందీయేతర రాష్ట్రాలు గుర్రుగా ఉన్నాయి. కేంద్రం తీసుకున్న ఇలాంటి చర్యలు గురించి తమకు అవగాహన లేదనీ, తాము మాతృభాషతో పాటు, హిందీ, ఇంగ్లీష్లను వినియోగిస్తామని పశ్చిమ బెంగాల్ మంత్రి, తృణమూల్ ప్రధాన కార్యదర్శి పార్థ చటర్జీ అన్నారు.
గతంలో రాష్ట్రాలను మూడు వర్గాలుగా కేంద్రం విభజించింది. హిందీ మాతృభాషగా ఉన్న రాష్ట్రాలను ఎ కేటగిరీగా, మాతృభాష కానప్పటికీ, హిందీ అధికంగా మాట్లాడే మహారాష్ట్ర, గుజరాత్లు బీ కేటగిరీగా, మిగిలినవీ సీ కేటగిరీగా విభజించింది. వర్గీకరణ ప్రకారం, ఎ కేటగిరీ రాష్ట్రాల్లోని కార్యాలయాల నుంచి సీ కేటగిరీ రాష్ట్రాలకు 65 శాతం, సీ నుంచి ఎ వరకూ 55 శాతం కమ్యూనికేషన్ హిందీలో ఉండాలి. వారు ఇచ్చే జవాబులో కూడా హిందీలోనే ఇవ్వాలని పేర్కొంది.