Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఐదురోజులు..1200 కిలోమీటర్లు..
- సైకిల్ తొక్కుతూ వలసకార్మికుని కుమార్తె సాహాసం..
పాట్నా : 'జ్యోతి కుమారి'.. ఈ పేరు రెండు మూడు రోజులుగా అందరి నోళ్లలోనూ పలుకుతోంది.. సాహసం, తెగువ, ధైర్యం, తండ్రిపై ప్రేమ అన్నింటినీ కలిపితే వచ్చిందే 'జ్యోతి కుమారి'. ఐదు రోజులపాటు సైకిల్ తొక్కుతూ 1,200 కిలోమీటర్ల ప్రయాణించడం అంటే ఒక సాహసమే. కానీ జ్యోతి కుమారి సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించింది. అవును నిజమే.. లాక్డౌన్ కారణంగా ఇటీవల గాయపడిన తన తండ్రిని సొంతూరుకు చేర్చడం కోసం 1,200 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించి ఢిల్లీ నుంచి దర్భాంగాకు చేర్చిన సంగతి తెలిసిందే. దీంతో 15 ఏండ్లు ఉన్న జ్యోతి కుమారి అందరి మన్ననలు, సర్వత్రా ప్రశంసలు పొందింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంకా సైతం ఆమె సాహసాన్ని ట్విటర్ ద్వారా కొనియాడారు. భారతీయుల ఆత్మస్థైర్యం, ప్రేమాభిమానాలను ఆమె కొనియాడారు. తాజాగా ప్రముఖ మ్యాథమెటీషియన్, సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ జ్యోతి కుమారికి ఉచితంగా ఐఐటీ-జేఈఈ కోచింగ్ అందిస్తామని ప్రకటించాడు. సూపర్ 30 తరపున ఆనంద్ కుమార్ తమ్ముడు జ్యోతి కుటుంబాన్ని కలిసి సహాయం అందించాడు. భవిష్యత్తులో ఐఐటీఎన్ కావాలనుకుంటే జ్యోతి కుమారికి తమ సూపర్ 30 స్వాగతం పలుకుతుంది అంటూ ఆనంద్ కుమార్ ట్వీట్ చేశారు. అంతకుముందు సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యోతికి సైక్లింగ్లో శిక్షణతో పాటు ఆమె చదువుకు కూడా సహాయం అందిస్తామని ప్రకటించింది. అంతేకాకుండా బీహార్కి చెందిన జ్యోతిని ధైర్యవంతురాలిగా ప్రశంసిస్తూ పలువురు మంత్రులు ఆమెకు సహాయం అందివ్వడానికి ముందుకు వచ్చారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి సైతం జ్యోతి చదువుకు, వివాహానికి అయ్యే మొత్తం ఖర్చు తానే భరిస్తానని ప్రకటించింది. అంతేకాకుండా ఆర్జేడీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన తండ్రికి ఉద్యోగం ఇస్తామని రబ్రీ దేవి కూడా హామీ ఇచ్చారు.