Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఇంగ్లండ్ నుంచి 60 ప్రత్యేక స్పేయర్లు
న్యూఢిల్లీ : మిడతల దాడిని నివారించడానికి ఇప్పటికే డ్రోన్లు ఉపయోగిస్తున్న భారత్ తాజాగా 60 ప్రత్యేక పురుగుల మందు స్పేయర్లను ఇంగ్లండ్ నుంచి కొనుగోలు చేయడానికి నిర్ణయం తీసుకుంది. జూన్..జులైలో కొత్తగా నాటిన ఖరీఫ్ పంటలపై దాడి చేయడానికి ముందే వాటిని అంతం చేయాలని భావిస్తుంది. ఈ స్పేయర్లలో 15 జూన్ 11లోగా, మరో 20ను జూన్ 25లోగా మిగిలిన 25ను జులై 9లో దిగుమతి అవుతాయని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తన అంతర్గత ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రస్తుతం మిడతలు దాడి తీవ్రంగా ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్ల్లో వినియోగించనున్నారు. ఇంగ్లండ్లోని ఎం/ఎస్ మైక్రాన్ సంస్థ తయారు చేసే ఈ స్పేయర్లు మిడతల నియంత్రణలో సమర్థవంతంగా పని చేస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు విశ్వాసంగా ఉన్నారు. ఏ రకమైన కీటకాలపై అయినా ఈ స్పేయర్లు ఉపయోగించుకోవచ్చు, వినియోగదారులకు ఎలాంటి హానీ ఉండదు.
కాగా, పైన పేర్కొన్న ఐదు రాష్ట్రాల్లో మిడతలు తీవ్రంగా ఉన్న 43 జిల్లాల్లో 303 ప్రదేశాల్లో నివారణ చర్యలు ఇప్పటికే జరుగుతున్నాయి. ట్రాక్టర్లు, ఐదు అగ్నిమాక యంత్రాలతో స్పేయర్లు పిచకారీ చేస్తున్నారు. ఇంగ్లండ్ నుంచి వచ్చే అదనపు స్పేయర్లు జూన్ నెల నుంచి పిచకారీ చేయనున్నారు.
రాజస్థాన్లోని జైపూర్ జిల్లాలో బుధవారం నుంచి డ్రోన్లతో పిచకారీ చేయడం ప్రారంభించారు. మరిన్ని డ్రోన్లను కేంద్ర వ్యవసాయ శాఖ అందచేయనుంది. ట్రాక్టర్లు, ఇతర వాహనాలతో పిచకారీ చేయలేని చోట డ్రోన్లతో పిచకారీ చేస్తారు. ఈ మిడతల గుంపు ఢిల్లీకి చేరే అవకాశం లేదని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతానికి ప్రభావిత ప్రాంతాల్లో 89 అగ్నిమాపక యంత్రాలు, 120 సర్వే వాహనాలు, 47 స్ప్రే యంత్రాలతో కూడిన 47 కంట్రోల్ యంత్రాలు, 810 ట్రాక్టర్లతో స్పేయర్లు పిచకారీ చేస్తున్నారు. మిడతల బెడద ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కేంద్రం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. గత ఏడాది తూర్పు ఆఫ్రికాలో భారీగా పుట్టుకొచ్చిన మిడతల అక్కడ నుంచి సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్తాన్కు చేరాయి. ఇప్పుడు భారత్లో పంటలను నాశనం చేస్తున్నాయి.
27 ఏండ్లలో ఈ ఏడాది మిడతల దాడి అతి పెద్దదని భారత వ్యవసాయ శాఖ హెచ్చరించింది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ల్లో మిడతల దాడి తీవ్రంగా ఉందని తెలిపింది. మిడతలు తమ మార్గంలో పచ్చని ఆకులు, పువ్వులు, పళ్లు, విత్తనాలు, కొమ్మలు, ఆకులు మొదలైన వాటిని నాశనం చేస్తాయనీ, దీంతో పంటలకు విపరీతమైన నష్టం జరుగుతుందని తెలిపింది. 'రాత్రివేళల్లో ప్రజలు తమ పంట ప్రాంతాలను పర్యవేక్షిస్తుండాలి, రాత్రి 7 నుంచి 9 గంటలకు లక్షలాది మిడతలు విశ్రాంతి కోసం మైదానాల్లో దిగుతాయని' సూచించింది. వీటిని ప్రారదోలడానికి భారీగా శబ్ధాలు చేయాలని తెలిపింది.