Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24 గంటల్లో 7,466 మందికి పాజిటివ్
న్యూఢిల్లీ : దేశంలో కరోనా పంజా విసురుతూనే ఉన్నది. గడిచిన 24 గంటల్లో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,466 కరోనా కేసులు నమోదు కాగా, వివిధ రాష్ట్రాల్లో 175 మంది మతిచెందారు. దేశంలో ఒక్కరోజు వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,65,799కి చేరింది. కాగా ఇప్పటివరకూ 71,105 మంది వ్యాధి నుంచి కోలుకొని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. అలాగే 4,706 మంది మతిచెందారు. ప్రస్తుతం 89,987 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్లలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. దేశ రాజధానిలోనూ వైరస్ మహమ్మారి పంజా విసురుతున్నది. గత 24 గంటల్లో ఢిల్లీలో 13 మంది చనిపోయారు. కాగా వైరస్ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 398కి చేరింది. కాగా, గత 34 రోజుల్లోనే 69 మంది చనిపోయినట్టు రికార్డులు తెలుపుతున్నాయి. అలాగే 24 గంటల్లో 1,106 కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్ బారిన పడినవారి సంఖ్య 17,386కు చేరింది. రాజధానిలో రికవరీ రేటు 50శాతంగా ఉందనీ, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని సిసోడియా తెలిపారు. కోవిడ్-19 లక్షణాలు ఉంటేనే ఆస్పత్రికి రావాలని సూచించారు.