Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు అంత్యక్రియలు
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్జోగి (74) కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాయ్పూర్లోని ఆస్పత్రిలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన కుమారుడు అమిత్ జోగి ట్విట్టర్లో ఈ విషయాన్ని పోస్టుచేశారు. '20 ఏండ్ల ఛత్తీస్గఢ్ రాష్ట్రం తన తండ్రిని కోల్పోయింది. ఓ నాయకుడ్ని కాదు.. ఓ తండ్రిని రాష్ట్రం కోల్పోయింది' అని అమిత్ జోగి ట్వీట్లో పేర్కొన్నారు. అజిత్ జోగి అంత్యక్రియలు శనివారం సొంతగ్రామం గొరెల్లాలో నిర్వహించనున్నట్టు తెలిపారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నెల 9 నుంచి రారుపూర్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి ఆయనకు వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. కాగా, పరిస్థితి మరింత విషమించటంతో శుక్రవారం మృతిచెందారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన మొదటి ముఖ్యమంత్రి (2000 నుంచి 2003 వరకు)గా పనిచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన మర్వాహీ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1986-1998 మధ్యకాలంలో అజిత్ రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి జేసీసీ(జే) పేరుతో సొంత పార్టీని ఏర్పాటుచేశారు. ఆయన రాజకీయ జీవితం అనేక వివాదాల్లో చిక్కుకుంది. 2019లో ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. నకిలీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ను పొందినట్టు ఆరోపణలతో అతనిపై కేసు నమోదైంది. 1946లో జన్మించిన అజిత్ జోగి భోపాల్లోని మౌలానా ఆజాద్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1968లో మెకానికల్ ఇంజినీరింగ్లో పట్టా పుచ్చుకున్నారు. గోల్డ్ మెడలిస్ట్ అయిన ఆయన.. కొన్నేండ్లపాటు రారుపూర్ నిట్లో లెక్చరర్గా పనిచేశారు. అనంతరం సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి ఐఏఎస్ సాధించారు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించారు. ఆయన మృతికి రాజకీయ ప్రముఖలు సంతాపం ప్రకటించారు.