Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ మోడలే... లెఫ్ట్ మోడల్ :
- సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
మహమ్మారి కరోనా కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్తో భారత ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతటి క్లిష్ట సమయంలో కూడా కేంద్రం దేశ ప్రజలకు చేసిన సాయం శూన్యమని, కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు కూడా నిధులు ఇవ్వటం లేదని ఆయన మండిపడ్డారు. బుధవారం ఢిల్లీలోని సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం (ఏకేజీ భవన్)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీతారాం ఏచూరి మాట్లాడారు. లాక్డౌన్ తర్వాత డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి మొదటి పొలిట్బ్యూరో సమావేశం విజయవంతంగా జరిగిందన్నారు. ఈ సందర్భంగా పొలిట్బ్యూరో సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. నిసర్గ తుఫాన్తో పోరాడుతున్న ప్రజానీకానికి తమ పార్టీ పొలిట్బ్యూరో సంఘీభావం తెలిపినట్టు వెల్లడించారు. తుఫాన్ సహాయక చర్యలు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు.
యావత్ మానవాళి ఉనికికే సవాలుగా మారిన కరోనాని కేరళ వామపక్ష ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని ఆయన కొనియాడారు. ప్రపంచ దేశాలన్నీ కేరళ మోడల్ను మెచ్చుకొని ఆ రాష్ట్రాన్ని చూసి దేశంలోని మిగతా రాష్ట్రాలు నేర్చుకోవాల్సి ఉందని చెప్పినట్టు గుర్తు చేశారు. లాక్డౌన్ సమయంలో మోడీ ప్రభుత్వం చేయాల్సిన ఏ పనిని సరైన విధంగా నిర్వర్తించలేదని ఏచూరి విమర్శించారు. ముందస్తు సమయం ఇవ్వకుండా నేరుగా లాక్డౌన్ ప్రకటించడం వల్లే ఈ దారుణ పరిస్థితి తలెత్తిందన్నారు. కరోనా వంటి క్లిష్ట సమయంలో పని చేస్తున్న జర్నలిస్టులపై యూఏపీఏ, దేశద్రోహ చట్టాలను ప్రయోగించడం ఆటవిక చర్యగా అభివర్ణించారు. దాంతోపాటు నయా ఉదారవాద ఏజెండాను కూడా అమలు చేసేందుకు మోడీ సర్కారు ఒడిగట్టిందన్నారు. అటామిక్ ఎనర్జీ, రక్షణ రంగం, రోదసీ వ్యవస్థల్లోకి కూడా ప్రయివేటు, విదేశీ పెట్టుబడిని అనుమతించడం దేశభక్తిపై బీజేపీ చిత్తశుద్ధి దేశానికి అర్థం అవుతుందన్నారు. స్వాతంత్య్ర కాలం నుంచి ఎమర్జెన్సీ వరకు కార్మికులు వీరోచిత పోరాటాలు చేసి తమ హక్కులను కాపాడుకున్నారని గుర్తు చేశారు. కానీ, వాటిని మోడీ సర్కారు పూర్తిగా తుంగలోకి తొక్కిందన్నారు. ఎవరూ కోనేందుకు లోన్లు తీసుకోరని... ప్రజలు స్వచ్ఛందంగా కోనేందుకు వారికి కోనుగోలు శక్తి ఉండాలన్నారు. దీనిపై దృష్టి సారించకుండా పెట్టుబడిదారులకు మరింత క్యాపిటల్ బెనిఫిట్(ద్రవ్య లబ్ధి) కల్పించడం దారుణమన్నారు. ఇంతకుముందే భారత ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉందని...లాక్డౌన్ విధింపు, మోడీ సర్కారు అనాలోచిత నిర్ణయాల కారణంగా ఎకనామిక్ వ్యవస్థ పూర్తిగా సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. లాక్డౌన్ ఎలా అమలు చేయాలో... ఎలా అన్లాక్ చేయాలో మోడీ సర్కారుకి తెలియలేదన్నారు. అందుచేత ఈ లాక్డౌన్ని అశాస్త్రీయ చర్యగా మార్చారన్నారు. కేవలం లాక్డౌన్ విధిస్తే ఏమి జరగదన్నారు. కాగా, ఈ విషయంపై చర్చ చేసేందుకు ప్రతిపక్ష పార్టీలతో ఏర్పాటు చేసిన సమావేశం మరొక సారి నిర్వహిస్తామన్నారు. సాక్షాత్తూ దేశ ప్రధాని... తన పదవి పేరుతో ఒక ట్రస్టును ప్రారంభించి వేల కోట్లు సేకరించడం స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. అసలీ డబ్బు ఎక్కడికి పోతున్నదో... ఎవరు ఆ డబ్బుని మానిటర్ చేస్తున్నారో... పారదర్శకత ఎక్కడ ఉందో ఎవ్వరికీ అర్థం కాని దుస్థితి నెలకొందని మండిపడ్డారు. వ్యవస్థలను ఇంత స్థాయిలో చిన్నబుచ్చుతూ తన వ్యక్తిగత ఇమేజ్ని పదిలపరుచుకుంటున్న ప్రధాని దేశ చరిత్రలో ఎవరూ లేరన్నారు. ఈ విధమైన చర్యలకి ఒడిగట్టడం పూర్తిగా భారత రాజ్యాంగ మూల సూత్రాలను ఉల్లంఘించడమేనని అన్నారు. కేరళ మోడల్ అంటే ఏమిటి... లెఫ్ట్ మోడలేనా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకి ఏచూరి ఆ రెండు ఒక్కటేనని సమాధానం ఇచ్చారు.