Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఢిల్లీలోని తమ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులకు కరోనా లక్షణాలు కనిపించడంలో వైద్య పరీక్షలు నిర్వహించామని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ క్రమంలోనే ఐదుగురు సిబ్బందికి పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని తెలిపింది. కాగా, ఢిల్లీలో ఇప్పటికే కరోనా బాధితుల సంఖ్య 20 వేలు దాటింది. కేసులు పెగుతుండటంతో తాజాగా మరిన్ని ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించడంతో వీటి సంఖ్య 158కి పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 22,132కు పెరిగింది. వీరిలో 556 మంది ప్రాణాలు కోల్పోగా.. 9,243 మంది కోలుకున్నారు.
రాజస్థాన్లో కరోనా విజృంభన
దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికం మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో నమోదైన కేసుల్లో ఈ రాష్ట్రాల వాటానే అధికం. కాగా, తాజాగా రాజస్థాన్లో 102 పాజిటివ్ కేసులు నమోదుకావడంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేలకు చేరువైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,475 కేసులు నమోదయ్యాయి. వీరిలో 203 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,766 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మరో రెండు నెలల్లో 32 లక్షల కేసులు !
దేశంలో లక్ష కేసులు దాటిన 15 రోజుల్లోనే రెట్టింపు స్థాయిలో రెండు లక్షల కేసులు నమోదుకావడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇదే వేగంతో కరోనా కేసులు విస్తరిస్తే మరో 30 రోజుల్లో 8లక్షలు, ఆపై మరో నెల రోజుల వ్యవధిలో 32 లక్షలకు పైగా కేసులు నమోదయ్యే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ వ్యాప్తి ఉధృతం అవుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో నిరోధక చర్యలు తీసుకోకుండా లాక్డౌన్ 5.0లో సడలింపుల చేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల విషయంలో భారత్ 7వ స్థానంలో ఉంది. అయితే, మరో మూడు నాలుగు రోజుల్లో ఇటలీ (2.33లక్షల కేసులు) కిందకి పంపుతూ.. భారత్ ఆరో స్థానానికి చేరడం ఖాయంగా కనిపిస్తున్నది. కేసులు విషయంలో మొదటి స్థానంలో ఉన్న అమెరికాను మరో మూడు నెలల్లో దాటేసే అవకాశాలు సైతం ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. భారత్లో కరోనా పరీక్షల సంఖ్య తక్కువగా ఉందనీ, టెస్టులు అధికంగా జరిపితే మరింతగా కొత్త కేసులు వెలుగులోకి వస్తాయని వైద్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ముంబయిలో మరణ మృదంగం
ముంబయిలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. మహారాష్ట్రలో నమోదవుతున్న వైరస్ కేసులు, మరణాల్లో అత్యధికం ముంబయిలోనే చోటుచేసుకుంటున్నాయి. అక్కడ ప్రతిరోజు వేలల్లోనే కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2,560 పాజిటివ్ కేసుల నమోదుతో పాటు 103 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 74,860లకు చేరింది. వీరిలో 2,587 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో 58 శాతం కేసులు ముంబయిలోనే నమోదయ్యాయి. ఇప్పటివరకూ అక్కడ 42 వేలకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మరణాల సంఖ్య 1,368 దాటింది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారవిలో ఇప్పటివరకూ 1,830 మంది వైరస్ బారినపడటం ఆందోళన కలిగిస్తున్నది. దీనికి తోడు నగరంలోని కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న ఆస్పత్రుల్లో పడకలు ఇప్పటికే రోగులతో నిండిపోయాయి.
''రెమ్డిసివిర్'' డ్రగ్కు ఆమోదం
కరోనా రోగుల కోసం అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు ''రెమ్డిసివిర్'' మందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతినిచ్చింది. ఈ మందు కరోనా రోగులకు బాగా ఉపయోగపడుతుందనీ, ఈ విషయం క్లీనికల్ ట్రయల్స్ వెల్లడైందని తెలిపింది. అటు జపాన్ ప్రభుత్వం సైతం కరోనా రోగులకు ఈ మందును ఉపయోగిస్తుండగా.. కరోనా చికిత్సకు ఇది బాగా ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఈ డ్రగ్ను కరోనా రోగులకు అత్యవసర సమయాల్లో మాత్రమే వినియోగించాలని డీసీజీఐ స్పష్టం చేసింది.
దేశంలో 198 రకాల కరోనా వైరస్లు
దేశంలో మొత్తం 198 రకాల కరోనా వైరస్లను గుర్తించామని జువాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జెడ్ఎస్ఐ) ప్రకటించింది. ఎక్కువ రకాలు గుజరాత్ (60), తెలంగాణ (55), ఢిల్లీ (39), మహారాష్ట్ర (15), కర్నాటక (15) రాష్ట్రాల్లో వ్యాప్తిలో ఉన్నాయంది. అలాగే, చైనా, ఐరాపోలకు చెందిన వైరస్ రకమే అధికంగా వ్యాప్తిలో ఉన్నట్టు తెలిపింది. దీనికి సంబంధించి జెడ్ఎస్ఐ డైరెక్టర్ కైలాష్ చంద్ర మాట్లాడుతూ.. ''దేశవ్యాప్తంగా కరోనాకు సంబంధించిన 400లకు పైగా జన్యుక్రమాలను పరిశీలించి 198 రకాలను గుర్తించామని'' అన్నారు. ఈ వైరస్ దేశంలోకి ప్రవేశించకముందే దాదాపు 200 సార్లు ఉత్పరివర్తనం చెంది ఉండవచ్చునన్నారు.
పీపీఈ కిట్లు లేక..
- ప్రమాదం అంచులో ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహిస్తున్న సిబ్బంది
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కోవిడ్-19 బారిన పడి చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించే సిబ్బందికి ఢిల్లీ సర్కారు వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) అందించకపోవడంతో వారి జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. ఢిల్లీలో కరోనాతో చనిపోయినవారిని 9 శ్మశానవాటికల్లో ఖననం చేస్తుండగా.. వారిలో చాలా మందికి పీపీఈ కిట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు దాకా పనిచేస్తున్నామనీ, రోజుకు ఒక్క సిబ్బంది ఐదారు మృతదేహాలను ఖననం చేస్తున్నారని నిగమ్ బోధ్ ఘాట్లో ఉన్న శ్మశానంలో సూపర్వైజర్గా పనిచేస్తున్న మహ్మద్ షమీ అన్నాడు. వైద్య, పారిశుధ్య, పోలీసు సిబ్బంది మాదిరి తాము కూడా కరోనా పోరులో నిత్యం ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడుతున్నామనీ, అయినా ఢిల్లీ సర్కారు తమ రక్షణను మరిచిందని అతడు వాపోయాడు. తమకు రక్షణ కిట్లు ఇప్పించాలని కోరినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అతడు ఆందోళన వ్యక్తం చేశాడు. చివరికి ఆస్పత్రులను, మున్సిపల్ అధికారులను అడిగితే పీపీఈ కిట్లు ఇప్పించారని షమీ తెలిపాడు. ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతున్నా.. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సర్కారు తమకు ఆరోగ్య బీమా కూడా కల్పించలేదని సిబ్బంది తెలిపారు.