Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ప్రస్తుత సడలింపులే జూలై 31 వరకూ..
- కంటెన్మెంట్జోన్లలో పూర్తిస్థాయి లాక్డౌన్
- మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
- పలు రాష్ట్రాల్లో సొంతంగా ఆంక్షలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 'అన్లాక్ 2'కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. అన్లాక్ 1.0 నేటితో పూర్తి కానుంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో లేకుండా పోవడంతో ప్రస్తుతం దేశవ్యాప్తం గా అమలవుతున్న సడలింపులతో కూడిన లాక్డౌన్ జూలై 31 వరకూ యథావిధిగా అమలవుతుందని కేంద్రం స్పష్టం చేసింది. జూలై 31 వరకూ కంటైన్మెంట్ జోన్లలో పూర్తి స్థాయి లాక్డౌన్ అమలవుతుందని, కట్టడి ప్రాంతాల్లో కేవలం నిత్యావసర కార్యకలాపాలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, విద్యా సంస్థలు, అంతర్జాతీయ విమాన సేవలు, మెట్రో రైళ్ల సేవలు, సినిమా థియేటర్లు, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, ప్రార్థనా మందిరాలకు అనుమతి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలావుండగా, రోజురోజుకీ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో చాలా
రాష్ట్రాలు లాక్డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడటం లేదు. చెన్నైలో మాదిరి లాక్డౌన్ను హైదరాబాద్లో విధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే అక్కడక్కడ వ్యాపారులు సమావేశమై సంపూర్ణబంద్ పాటిస్తున్నారు. ఏపీలోనూ ప్రాంతాల వారీగా ఆంక్షలు విధించబోతున్నది. పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్లో అంతర్రాష్ట్ర, స్థానిక ప్రయాణాలపై నిషేధం విధించారు. అసోం రాజధాని గువహతి ఉన్న జిల్లాలో ఆస్పత్రులు, ల్యాబ్లు, మందులషాపులు తప్ప మరేవీ తెరవటం లేదు. మహారాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలను పూర్తిగా తొలగించబోమని సీఎం ఉద్ధవ్ థాకరే ఇప్పటికే స్పష్టం చేశారు. ముంబయి ప్రజలు తమ నివాసానికి రెండు కిలోమీటర్ల పరిధి దాటి బయటకు వెళ్లొద్దని పోలీసులు సూచించారు. శని,ఆదివారాలు పూర్తిగా లాక్డౌన్ ప్రకటించాలని కర్నాటక సర్కారు నిర్ణయించింది. మణిపూర్లో జూలై 15 దాకా లాక్డౌన్ను పొడిగిస్తున్నట్టు ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ ప్రకటించారు.