Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-తీవ్రమైన నేరాలు మినహా మామూలుకేసుల్లో ఆచితూచి అరెస్టులు
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా వైరస్ కారణంగా పోలీసుల నేర విచారణ, నిందితుల అరెస్టులు కూడా స్లోడౌన్ బాట పట్టాయి. గత నాలుగు నెలలుగా వెంటాడుతున్న కరోనాను కట్టడి చేయడంపైనే ఇతర ప్రభుత్వ యంత్రంగాలతో కలిసి పోరాడుతున్న పోలీసులు నేర విచారణపై సమయం కేటాయించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. విజృంభిస్తున్న కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి సర్కారు విధిస్తూ వచ్చిన లాక్డౌన్లు మొదలుకుని కంటైన్మెంట్ ఏరియాలలో బందోబస్తులకే వీరి సమయం పూర్తిగా వినియోగమవుతోంది. నాలుగు లాక్డౌన్ల అనంతరం అన్లాక్లోకి అడుగు పెట్టాక వివిధ కేసులకు చెందిన విచారణ, నిందితుల అరెస్టులపై దృష్టిని సారించాలని దర్యాప్తు అధికా రులు భావించారు. కాని అన్లాక్ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, దీంతో కరోనా కేసులు కూడా విపరీతంగా పెరిగి పోవడంతో పోలీసులకు మరింతగా పని భారం పెరిగిపోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక వేళ ఏదేని కేసులో విచారణ కోసం నిందితులను తీసుకు వస్తే వారి వలన కరో నా వైరస్ ఎక్కడ తమకు సోకుతుందోననే అంతర్గత ఆందోళన దర్యాప్తు జరుపుతున్న వారిలో పెరిగి పోయినట్టు తెలుస్తోంది. కేసుల దర్యాప్తు అటుంచి పోలీసు స్టేషన్లలోనే తోటి సిబ్బంది కారణంగా ఎక్కడ తమకు ఈ వ్యాధి సంక్రమిస్తుందో అనే భయం కూడా పెరిగిపోయింది. కారణం విధి నిర్వాహణలో భాగంగా ఎక్కడెక్కడో తిరిగి కాని స్టబుళ్లు, హౌంగార్డులు స్టేషన్కే చేరుకోవడం, వారు ఎక్కడో కొంత నిర్లక్ష్యంగా ఉండటంతో కరోనా వైరస్ సోకడం వంటి ఘటనలు చోటు చేసుకోవడం దీనికి కారణంగా తెలుస్తోంది. ఇక తప్పని సరిగా పరిస్థితుల్లో అదుపులోకి తీసుకున్న నిందితులను స్టేషన్ లాకప్లో ఉంచడం కూడా వీరికి సమస్యగా పరిణమిస్తోంది. తీసుకువచ్చే నిందితులలో ఎవరికి కరోనా సోకింది, ఎవరికి లేదనేది తేల్చుకోవడం కష్ట సాధ్యం కావడం, కరోనా సోకినా కొందరిలో లక్షణా లు కనిపించక పోవడం వంటి కారణాలు కూడా కేసుల దర్యాప్తు చురుకుగా సాగించక పోవడానికి కారణాలుగా పోలీసు అధికార వర్గాలు పేర్కొంటు న్నాయి. హత్యలు, దోపిడీలు, హత్యాయత్నాలు, లైంగికదాడులు మొదలైన తీవ్రమైన కేసులు, పెద్దల జోక్యంతో కూడిన కేసులలో మాత్రమే నిందితులను తప్పనిసరిగా పోలీసులు అరెస్టు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కరోనా నియంత్రణ విధుల్లో ఉండి వైరస్ బారిన పడుతున్న పోలీసుల సంఖ్య పెరుగుతుండటంతో కేసుల దర్యాప్తు విషయంలో ఉన్నతాధికారులు సైతం క్రింది స్థాయి అధికారులు, సిబ్బందిపై వత్తిడి తీసుకు రావడం లేదని సమాచారం. ఒక వేళ వత్తిడి తెస్తే మరో వైపు కరోనా వైరస్ విస్తరణను పెంచినట్టు అవుతుందని సీనియర్ పోలీసు అధికారులు సైతం ఆచి తూచి వ్యవహరిస్తున్నారని తెలిసింది. సంచలనం రేపిన కేసులు, నేర తీవ్రత ఎక్కువగా ఉన్న కేసులు, ఎక్కువగ ఆ ప్రజా జీవితంపై ప్రభావం చూపుతున్న కేేసుల పట్ల ఎక్కువగా శ్రద్ద వహిస్తున్న అధికారులు మిగతా కేసులను కరోనాతీవ్రత తగ్గాక చూసుకోవచ్చని భావిస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్, సైబరాబాద్,రాచకొండ మొదలైన ప్రధాన పోలీసు కమిషనరేట్ల పరిధులలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గలేదు. మిగతా జిల్లాల్లో సైతం కరోనా నేనున్నాను అంటూ పడగ విప్పుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నేర తీవ్రత కలిగిన కేసుల పరిష్కారం పైనే దర్యాప్తు అధికారులు దృష్టిని సారించారని తెలుస్తోంది. దాదాపుగా సీఐడీలో సైతం ఇదే వాతావరణం నెలకొన్నట్టు సమాచారం. కాగా మరో వైపు కోర్టులకు కూడా సెలవులు ఉండటంతో నిందితుల అరెస్టులు, కోర్టులలో వారిని హాజరుపరచడాలు వంటి ప్రక్రియను కొంత కాలం పక్కన పెట్టడమే మేలన్న తీరులో పోలీసులు ఉన్నారని సమాచారం.