Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-పోలీసులను హతమార్చిన వికాస్ దూబే ఇల్లు నేలమట్టం
-బలమైన రాజకీయ పలుకుబడి
లక్నో : మూడు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లో 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న గ్యాంగ్ స్టార్ వికాస్ దూబే ఇంటిని ఆదివారం పోలీసులు కూల్చివేశారు. రక్షకభటులను హతమార్చిన నేపథ్యంలో యోగీ ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించింది. అయితే 60 కేసుల్లో నిందితుడిగా ఉన్న దూబే కు ఎన్నో ఏండ్లుగా రాజకీయ పార్టీల అండ ఉందనీ, అందుకే అతడిపై ఎన్ని కేసులున్నా తప్పించుకుని తిరుగుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులంటే అతడికి భయం లేదనీ, చాలా మంది సీనియర్ అధికారులు పోస్టింగులుకు సంబంధించి దూబే వద్దకు వస్తారని వారు చెబుతున్నారు. యూపీలో ఇప్పటికీ వర్ధిల్లుతున్న కుల వ్యవస్థ కారణంగా దూబే ఆగడాలకు అంతే లేదని అంటున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ నేతలతో అతడు సత్సంబందాలు నెరిపేవాడు. ఈ క్రమంలో పోలీసుల్లోను అతడికి అనుచరులున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే అతడిని అరెస్ట్ చేయడానికి వస్తున్న విషయాన్నీ పోలీసు డిపార్ట్మెంట్ కు చెందినవారే సమాచారం అందించారని స్థానిక అధికారి ఒకరు చెప్పారు.
మరోవైపు యోగీ ఆదిత్యనాథ్ మూడేండ్లుగా అమలుచేస్తున్న ఎన్ కౌంటర్ల జాబితాలో దూబే పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే పోలీసులు దూబేను పట్టుకోవాలనుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2001 లో అతడు బీజేపీ నాయకుడు సంతోష్ కుమార్ శుక్లాను శివాలి పోలీసుస్టేషన్ ఆవరణలోనే హతమార్చాడు. అప్పుడు యూపీ సీఎం గా ప్రస్తత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉన్నారు. అయినప్పటికీ ఆ కేసులో దూబే నిర్దోషిగా బయటికి వొచ్చాడు. తదనంతర కాలం లో అతడి తుపాకీని పోలీసులు దూబే కే అప్పగించడం గమనార్హం.
వికాస్ దూబే అనుచరుడు అరెస్టు
లక్నో : 8 మంది పోలీసులను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు వికాస్ దూబే అనుచరుడ్ని అరెస్టు చేశారు. దూబే ప్రధాన అనుచరుడు దయాశంకర్ అగ్నిహోత్రి అలియాస్ కాలును ఎన్కౌంటర్ కేసులో అరెస్టు చేసినట్లు కాన్పూర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ మోహిత్ అగర్వాల్ తెలిపారు. ఆదివారం ఉదయం కళ్యాణ్పూర్-శివ్లి రోడ్లో అరెస్టు చేస్తున్న సమయంలో అగ్నిహోత్రి కాల్పులకు తెగబడ్డాడని, పోలీసులతో ముఖాముఖీ గొడవల కోసం తన మనుషులను కూడా పిలిచినట్లు చెప్పారు. ఈ సమయంలో దయాశంకర్ కాలికి బుల్లెట్ గాయం అయినట్లు చెప్పారు. పోలీసుల హత్య కేసులో దయాశంకర్ పేరు ఉందని, ఇతనిపై రూ 25 వేల రివార్డు ఉందని ఐజి తెలిపారు. 60 కేసుల్లో నిందితుడిగా ఉన్న గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను పోలీసులు అరెస్టు చేయడానికి వెళ్లినప్పుడు పోలీసుల బృందంపై దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రాతో సహా ముగ్గురు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లు మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.