Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్థానికులు, పర్యావరణవేత్తల డిమాండ్
ఆందోళన ఆగేదిలేదు : కార్మిక నేతలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని దాదాపు 400 బొగ్గు గనులు సంస్థల్లో ఈ నెల 2 నుంచి 72 గంటలపాటు జరిగిన సమ్మె విజయవంతమైంది. కార్మికుల మూడు రోజుల సమ్మెతో సాధారణ ఉత్పత్తి, సరఫరా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ప్రభుత్వరంగ సంస్థల మైన్లు, అనుబంధ సంస్థల్లో కార్మికులందరూ సమ్మెలో పాల్గొన్నారు. బొగ్గుగనుల ప్రయివేటీకరణను నిరసిస్తూ కార్మికుల నినాదాలు మిన్నంటాయి. దాదాపు 5.3 లక్షల మంది శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులు మూడు రోజుల సమ్మలో పాల్గొన్నారు. మొత్తం ఉద్యోగుల్లో 95శాతం మంది సమ్మెలో పాల్గొన్నట్టు అంచనా. యూనియన్లీ సమ్మెలో పాల్గొనగా.. భారతీయ మజ్దూర్ సంఫ్ు (బీఎంఎస్) కూడా మద్దతు తెలపటం గమనార్హం.
సమ్మె విజయవంతమైన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించేందుకు యూనియన్ నేతలు ఆన్లైన్ సమావేశం జరిగినట్టు ఇండియన్ నేషనల్ మైన్ వర్కర్స్ ఫెడరేషన్ (ఐఎన్ఎమ్ఎఫ్) సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఎస్.క్యూ జమా తెలిపారు. ప్రభుత్వ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భవిష్యత్లో కూడా తమ ఆందోళనను కొనసాగిస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వం ప్రయివేటీకరన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే.. 'సహాయ నిరాకరణ ఉద్యమాన్ని' చేపడతామని ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐసీఎఫ్డబ్ల్యూ) ప్రధాన కార్యదర్శి డిడి రమానందన్ హెచ్చరించారు.
'కేంద్ర సర్కార్ మొండి వైఖరిని అవలంభిస్తున్నది. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరంతర ఉద్యమం చేపడతాం. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు కాఇర్మకులు సిద్ధంగా ఉన్నారని రమానందన్ చెప్పారు. కాగా, కేంద్ర సర్కార్ చేపట్టిన ఈ సంస్కరణలను పౌర సమాజ సంస్థలు, పర్యావరణ వేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిషా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో 41 బొగ్గు బ్లాకులను ప్రభుత్వం ప్రయివేటుకు అప్పగించాలని తీసుకున్న నిర్ణయాన్ని వారు తీవ్రంగా తప్పుపట్టారు.
ప్రయివేటు రంగానికి తలుపులు బార్లా తెరవటమంటే.. దేశ సంపదను కార్పొరేట్ శక్తలకు కట్టబెట్టడమననీ, కార్మికుల శ్రమశక్తిని దోచుకునేందుకు వారికి అవకాశాలను కల్పించటమేకాక, పర్యావరణ నష్టాలకు బాటలు వేయటమేనని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, మైనింగ్ ప్రదేశాల్లో నివసిస్తున్న ప్రజల ప్రాణాలకు ముప్పువాటిల్లినట్లేనని విమర్శించారు.
'జార్ఖండ్లో ప్రయివేటుకు కట్టబెట్టేందేకు చూస్తున్న బొగ్గు బ్లాకుల్లో ఎక్కువ భాగం గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో వున్నాయి. ప్రయివేటు శక్తులు ఆరి జీవనోపాధిని నాశనం చేస్తాయి. కనీసం ఎవరినీ సంప్రదించకుండా కేంద్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నది. గిరిజనుల హక్కులు, జీవనోపాధికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా?' అని జార్ఖండ్ పౌర హక్కుల నేత మంథన్ ప్రశ్నించారు. బొగ్గు మైన్ల చుట్టుపక్కల గ్రామ ప్రజలు సైతం సమ్మెకు మద్దతు తెలిపారని చెప్పారు. రాబోయే రోజుల్లో గ్రామసభల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు.
జార్ఖండ్ ముక్తి మోర్చా నేత హేమంత్ సోరెన్ నేతత్వంలోని ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా బొగ్గు గనుల వేలంపై కేంద్రంతో విభేదిస్తున్నది. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. రాష్ట్రంలోని తొమ్మిది బొగ్గు బ్లాక్లు షెడ్యూల్-5 ప్రాంత పరిధిలోనివి. అంటే గిరిజనులకు మినహా మరెవరికీ భూమిని బదిలీ చేయరాదు. కేంద్ర ప్రభుత్వం గనులను ప్రయివేటుకు అప్పగిస్తూ నిర్ణయం ఎలా తీసుకుంటుందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో జేజేఎం పేర్కొన్నది.
అదేవిధంగా బొగ్గు కార్మికుల సమ్మెను పర్యావరణ నిపుణుడు కంచి కోహ్లీ ప్రశంసించారు. దీనిని ఓ రంగ సమస్యగా వేరుచేసి చూడరాదని ఆమె అభిప్రాయపడ్డారు. మైనింగ్ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించటమంటే బాధ్యతల నుంచి తప్పుకోవటంతోపాటు, కార్మిక, పర్యావరణ చట్టాలను నీరుగార్చే చర్యల్లో భాగంగానే దీనిని చూడాలని కోహ్లీ అన్నారు. బొగ్గు కార్మికులతోపాటు, వారి వాణిని మరింత బలంగా వినిపించేందుకు స్థానికులు కలిసి రావటం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆమె సూచించారు.
దేశ ఖనిజవనరులను దోపిడీశక్తులకు అప్పగించటాన్ని కేంద్ర కార్మిక సంఘాలు సైతం తప్పుపట్టాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ ఉద్యమిస్తున్న బొగ్గు కార్మికులకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి.