Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-దాంతో నష్టపోయేది భారతే
- నిషేధం కంటే మన ఆర్థిక వ్యవస్థను బలపర్చుకోవడం మేలు :
నిటిఆయోగ్ మాజీ వైస్ చైర్మెన్ అరవింద్ పనగరియా
న్యూఢిల్లీ : చైనాతో వాణిజ్య యుద్ధం ఆ దేశం కంటే భారత్కే ఎక్కువ నష్టమని నిటిఆయోగ్ మాజీ వైస్ చైర్మెన్ అరవింద్ పనగరియా అన్నారు. ఈ కారణంగా మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రముఖ ఆంగ్ల వెబ్ పోర్టల్ 'ది వైర్'కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన పైవ్యాఖ్యలు చేశారు. గాల్వాన్ వ్యాలీలో సరిహద్దు వివాదం తర్వాత చైనాకు చెందిన 59 యాప్లపై భారత్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీనిపై పనగరియా స్పందిస్తూ.. చైనా నుంచి భారత్కు ఎగుమతి చేసేది వారి మొత్తం ఎగుమతుల్లో 3 శాతం మాత్రమే అనీ, కానీ మనం దిగుమతి చేసుకునేవి 15 శాతం దాకా ఉన్నాయని అన్నారు. ఇవి చాలా ముఖ్యమైన దిగుమతులనీ, చైనా వస్తువుల మీద మన దేశం నిషేధం విధిస్తే దాని ప్రభావం వాటి మీద ఉంటుందని చెప్పారు. ఈ వస్తువుల మీద చైనా ఆంక్షలు విధిస్తే అది భారత్కు తీరని నష్టం అని అన్నారు. చైనాతో వాణిజ్య యుద్ధం మన ఆర్థిక వ్యవస్థను మరింత వెనక్కి నెట్టే ప్రమాదం లేకపోలేదని ఆయన తెలిపారు. కరోనా కంటే ముందే మన వృద్ధి రేటు 4.2 శాతంగానే ఉందన్నారు. కరోనా కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూ చూడని సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని అన్నారు. ఈ సమయంలో చైనా నుంచి దిగుమతి చేసుకునే వాటి మీద ఆంక్షలు విధిస్తే వృద్ధి రేటు 7 శాతానికి చేరుకోవడం అసాధ్యమని పనగరియా అభిప్రాయపడ్డారు. ఒక దేశం నుంచి దిగుమతి చేసుకునే వాటి మీద ఆంక్షలు విధించి ప్రయోజనం పొందిన దేశం ఏదీ లేదనీ, ఒకవేళ అలా లాభపడిన దేశాలు ఏమైనా ఉంటే తనకు చూపాలని సవాల్ విసిరారు. అది ఏ దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని పనగరియా తెలిపారు. 1960 - 90 మధ్య కాలంలో వచ్చిన ప్రపంచ వాణిజ్య ఒప్పందాలను ఉపయోగించుకొని దక్షిణ కొరియా, తైవాన్, సింగపూర్లు తలసరి ఆదాయాన్ని పెంచుకున్నాయనీ, ఇదే విధంగా చైనా ముందుకెళ్లిందని వివరించారు. కానీ ఆ దేశాలతో పోల్చితే మన దేశ తలసరి ఆదాయం చాలా తక్కువని అన్నారు. ఇరుగు పొరుగు దేశాలతో వాణిజ్యం కారణంగా పోటీతత్వం, ఉత్పాదకత పెరుగుతుందని పనగరియా అన్నారు. చిన్న సంస్థలు లాభపడతాయని తెలిపారు. చైనాతో భారత్ కు భారీ సరిహద్దు ఉన్నదనీ, ఇరు దేశాల మధ్య సఖ్యత ఉంటేనే రెండు దేశాలకు మంచిదని చెప్పారు.