Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-19 వేలు దాటిన మృతులు
- రెండు లక్షల కేసులు దాటేసిన మహారాష్ట్ర
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. గత వారం రోజులుగా భారత్లో నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటలో అత్యధికంగా 24,850 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా నిత్యం సంభవిస్తున్న కరోనా మరణాల సంఖ్య ఆందోళనకరంగా మారుతున్నది. 24 గంటలో దేశంలో 613 మరణాలు చోటుచేసుకోవడం మహమ్మారి తీవ్రతకు అద్దం పడుతున్నది. దేశవ్యాప్తంగా ఒక్కరోజు గడువులో ఈ స్థాయిలో మరణాలు, కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో ఆదివారం నాటికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 6,73,165గా చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. వీరిలో ఇప్పటి వరకు 19,268 మంది మృతిచెందారు. కరోనా వైరస్ సోకిన వారిలో ఇప్పటిదాకా 4,09,083 మంది కోలుకున్నారు. కాగా, మరో 2,44,814 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 14,856 మంది కోలుకొని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా బాధితుల రికవరీ రేటు 60.77 శాతంగా ఉండగా మరణాల రేటు 2.9శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,48,934 కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వైరస్ వెలుగు చూసిన నాటి నుంచి దేశవ్యాప్తంగా 97,89,066 నమూనాలను పరీక్షించారు.
శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసులతో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరువయ్యింది. తాజాగా కేసుల సంఖ్య 6,73,165కు చేరడంతో రష్యా (6,73,564) దగ్గరగా ఉంది. ప్రస్తుతం 28 లక్షల పాజిటివ్ కేసులతో అమెరికా తొలి స్థానంలో ఉండగా, 15 లక్షల కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో కొనసాగుతున్నది. తొలి స్థానంలో ఉన్న అమెరికా మినహా, బ్రెజిల్, రష్యాలలో నిత్యం దాదాపు 7వేల పాజిటివ్ కేసులు నమోదవుతుండగా భారత్లో మాత్రం ఆ సంఖ్య 25 వేలకు చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది.
''మహా''లో రెండు లక్షలు దాటిన కేసులు
మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దేశంలోనే అత్యధిక తీవ్రత మహారాష్ట్రలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో 7,074 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 295 మంది కరోనా రోగులు మతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,00,064కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 8,671 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో నమోదవుతున్న మొత్తం కరోనా మరణాల్లో 45 శాతానికి పైగా కేవలం ఇక్కడే సంభవిస్తున్నాయి.
లక్షకు చేరువలో ఢిల్లీ
మహారాష్ట్ర అనంతరం తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో కేసులు, మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నా యి. దేశ రాజధానిలో గత 24 గంటల్లో 2,505 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 97,200లకు చేరింది. వీరిలో ఇప్పటి వరకు 3,004 మంది మత్యువాతపడ్డారు. అలాగే నిన్న ఒక్కరోజే 2,500 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 68,256కు చేరింది. ఢిల్లీలో రికవరీ రేటు దాదాపు 70 శాతానికి చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆస్పత్రిలో చికిత్స అవసరమవుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతోందని పేర్కొన్నారు.