Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల్లో మూడో స్థానంలోకి భారత్
- ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా కేసులు..
-19 వేలకు పైగా మరణాలు
న్యూఢిల్లీ : భారత్ను కరోనా తీవ్రంగా కబళిస్తోంది. రోజురోజుకూ కోవిడ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య దేశంలో పెరిగిపోతున్నాయి. తాజాగా ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ ఏడు లక్షల మార్కును చేరుకొని మూడో స్థానంలోకి వెళ్లింది. ఇప్పటి వరకు మూడో స్థానంలో ఉన్న రష్యాను దాటి.. ఏడు లక్షలకు పైగా కేసులతో భారత్ ప్రమాదకరస్థాయిని చేరుకున్నది. అత్యధిక కేసులు నమోదైన తొలి రెండు స్థానాల్లో అమెరికా(29 లక్షల కేసులు), బ్రెజిల్(16 లక్షల కేసులు) దేశాలు ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం.. భారత్లో గడిచిన 24 గంటల్లో 24,248 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 7లక్షలపైగా చేరుకున్నది. ఇక మహమ్మారి కారణంగా దేశంలో తాజాగా 425 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య భారత్లో 19,714కు పెరిగిపోయింది. కరోనా బాధితుల్లో 4.25 లక్షల మందికి పైగా ప్రజలు కోలుకున్నారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1.15 కోట్ల మంది వైరస్ బారిన పడ్డారు. దాదాపు 5.36 లక్షల మందికి పైగా మరణించారు. 65 లక్షల మందికి పైగా ప్రజలు కరోనా నుంచి కోలుకున్నారు.
ఆ మూడు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ
మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలలో కరోనా విళయతాండవం చేస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కేసుల సంఖ్య 2.06 లక్షలకు చేరుకున్నది. ఇందులో దాదాపు 85వేల కేసులు(సుమారు 41శాతం) ముంబయి మహానగరం నుంచే నమోదు కావడం గమనార్హం. ఇక మరణాల సంఖ్య 8822కు(ముంబయిలోనే దాదాపు 5000 మంది మరణించారు) చేరుకున్నది. దేశరాజధానిని కరోనా మహమ్మారి పీడిస్తున్నది. ఢిల్లీ సర్కారు వెల్లడించిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఇక్కడ కొత్తగా 1379 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య లక్ష మార్కును దాటి 1,00,823ను చేరుకున్నది. తాజాగా కోవిడ్తో 48 మంది మరణించగా...మృతుల సంఖ్య 3115కు చేరుకున్నది. తమిళనాడులో కొత్తగా 3,827 కేసులు నమోదయ్యాయి. 61 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1.14 లక్షకు పైగా, మృతుల సంఖ్య 1571కు చేరుకున్నది. అలాగే మధ్యప్రదేశ్లో 354 కొత్త కేసులతో కరోనా బాధితుల సంఖ్య 15,284కు చేరుకున్నది. అలాగే కేరళలో 193 కొత్త కేసులతో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 5,522కు పెరిగింది.
'మహా' పోలీసులపై కరోనా దాడి
మహారాష్ట్రలో సాధారణ ప్రజలనే కాదు.. ఏకంగా ఆ రాష్ట్ర పోలీసులను సైతం కరోనా మహమ్మారి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇక్కడ తాజాగా ఒక్కరోజులోనే 279 మంది పోలీసు అధికారులకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో పోలీసు దళంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 5,454కు చేరుకున్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 70 మంది పోలీసు సిబ్బంది కరోనాతో మరణించడం తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నది.
25000 దాటిన కరోనా కేసులు
-తెలంగాణలో ఒక్కరోజే 11 మంది మృతి.. 1831 పాజిటివ్లు
- గ్రేటర్లో 1419
- మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ 100కిపైగా కేసులు
కరోనా రోగులు సోమవారం ఒక్కరోజే 11 మంది చనిపోయారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25000 దాటింది. ఆదివారం కాస్త తగ్గినట్టే తగ్గిన కేసులు మళ్లీ 1800పైగా పెరిగాయి. సోమవారం నాడు 6,383 టెస్టులకు సంబంధించిన ఫలితాలను వెల్లడించగా 1831 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. తాజా కేసులతో కలిసి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25,773కి చేరింది. మొత్తం 10,646 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2078 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 14,781కి చేరుకున్నది. సోమవారం నాటి మృతుల సంఖ్యతో కలిపి రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య మృతుల సంఖ్య 306కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1419 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 160, మేడ్చల్లో 117 , ఖమ్మం జిల్లాలో 21, మంచిర్యాల, మెదక్లో 20 చొప్పున కేసులు వచ్చాయి. రాష్ట్రంలో గాంధీ, కింగ్కోఠి, చెస్ట్, ఫీవర్ ఆస్పత్రుల్లో 1340 బెడ్లు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఒక్కగాంధీలోనే ఇంకా 1058 బెడ్లు ఖాళీగా ఉన్నాయని తెలిపింది.