Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడి
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 4.5 శాతం ప్రతికూల వృద్ధిని చవి చూడనుందని స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. కరోనా వైరస్ ప్రభావం, సూక్ష్మ ఆర్థికాంశాల్లో స్తబ్దత, అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలు తదితర వాటివల్ల జీడీపీ మైనస్లోకి పడిపోనుందని ఆర్ధిక వ్యవహారాల శాఖ (డీఈఏ) తన సూక్ష్మ గణంకాలు - జూన్ 2020 రిపోర్ట్లో విశ్లేషించింది. దేశ వృద్ధి రేటు 1.9 శాతానికి పడిపోవచ్చని గడిచిన ఏప్రిల్లో
పేర్కొన్న దానికంటే భారీ క్షీణత నమోదు కానుంది. కరోనా వైరస్ విస్తృతి వల్ల డిమాండ్, సరఫరాలో నెలకొన్న అంతరం వృద్ధి రేటును దెబ్బతీస్తుందని పేర్కొంది. సోమవారం విడుదల చేసిన ఈ రిపోర్ట్ ప్రకారం.. వైరస్ నియంత్రణకు చేపట్టిన లాక్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ మందగించింది. దీంతో వేలాది ఉద్యోగాలు కూడా పోయాయి. విత్త మార్కెట్లు ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా నష్టాన్ని చవి చూశాయి. భారత జీడీపీ 4-5 శాతం మధ్య క్షీణించవచ్చని ఐఎంఎఫ్ అంచనాలను గుర్తు చేసింది. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడానికి చాలా దీర్ఘకాల సమయం పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారని పేర్కొంది.
కరోనా వైరస్కు వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఆర్థిక వ్యవస్థకు పెను సవాలేనని డీఈఏ తన రిపోర్ట్లో తెలిపింది. ఎన్ఎస్ఒ గణంకాల ప్రకారం.. 2019-20లో భారత జీడీపీ 4.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 6.1 శాతంగా ఉంది. తాజా రిపోర్ట్ ప్రకారం ఆర్థిక వ్యవహారాలు నిలిచిపోవడంతో 2020-21 పన్ను వసూళ్లలో తగ్గుదల చోటు చేసుకోనున్నది. 2020 మే నాటికి విత్త లోటు రూ.4.5 లక్షల కోట్లుగా నమోదైంది. రెవెన్యూ రసీదులు ఏకంగా 68.9 శాతం ప్రతికూల వృద్ధి చోటు చేసుకుంది. వ్యక్తిగత ఆదాయ పన్ను, పరోక్ష పన్నుల్లో భారీ క్షీణత చోటు చేసుకుంది.