Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఆసియాలోనే అతిపెద్ద మురికివాడలో కోవిడ్..19 నియంత్రణ
- కొత్త కేసులు నామమాత్రమే..
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరున్న ధారవి.. కేరళ ఇచ్చిన స్ఫూర్తితో కరోనా మహమ్మారిని విజయవంతంగా కట్టడి చేసింది. నానాటికీ విస్తరిస్తున్న మహమ్మారిని ఇంతపెద్ద మురికివాడలో కట్టడి చేయడమంటే సాహసమే. కానీ కేరళ మోడల్ ను అమలుపర్చి ధారవిలో కరోనాను అరికట్టడంలో బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు సఫలీకృతులయ్యారు. ముంబయి నగరంలో వైరస్ వ్యాప్తి విస్త్రతంగా ఉన్నా.. ధారవి లో మాత్రం పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ముంబయి : సుమారు 7 లక్షల మంది జనాభా ఉండే ఈ మురికివాడలో.. జూన్ మాసాంతానికి 43 కేసులే నమోదు కావడం గమనార్హం. మొత్తంగా అక్కడ ఇప్పటివరకు 2,309 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో 551 మంది మాత్రమే చికిత్స తీసుకుంటున్నారు. 1672 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మరి ధారవి కోలుకోవడానికి కేరళ ఇచ్చిన స్ఫూర్తి ఏంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఏప్రిల్ 1 న ధారవిలో మొదటి కరోనా కేసు నమోదైంది. ఆ నెల ముగిసేనాటికి అక్కడ 491 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసులు రెట్టింపయ్యే రేటు 18 శాతంగా ఉంది. కేసులలో వృద్ధి రేటు 4 .3 శాతంగా ఉంది. కానీ మే చివరినాటికి అక్కడ కేసుల రెట్టింపు రేటు 1 .02 శాతానికి పడిపోయింది. గడిచిన 7 రోజుల్లో ఇది 0. 55 శాతానికి తగ్గింది.
ధారవిలో కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యం లో పరిస్థితులను అదుపులోకి తేవడానికి మహారాష్ట్ర సర్కారు కేరళను సాయం కోరింది. ముంబయికి వైద్యులను పంపించాలని అడిగింది. ఇదే విషయమై మహారాష్ట్ర వైద్య శాఖ మంత్రి రాజేష్.. కేరళ వైద్య శాఖ మంత్రి కెకె శైలజ తో నేరుగా మాట్లాడారు. ఈ సందర్బంగా శైలజ కేరళ లో వైరస్ ను అరికట్టడంలో తీసుకున్న చర్యలను ఆయనకు వివరించారు. ఇదే క్రమంలో మానవతా హృదయంతో స్పందించిన అక్కడి వామపక్ష సర్కారు.. 50 మంది డాక్టర్లు, 100 మంది నర్సుల బందాన్ని పంపింది.
కేరళలో వైరస్ ను అరికట్టడానికి గాను అది వ్యాప్తి చెందిన ప్రాంతంలో విస్తృతంగా టెస్టులను నిర్వహించడం.. లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్ కు పంపడం వంటివి విరివిగా చేపట్టారు. వైద్య యంత్రంగం మొత్తం నిత్యం అలర్ట్ గా ఉంటూ కేసులు వచ్చిన వెంటనే యుద్ధమేఘాల మీద స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడారు.. హాస్టళ్లను, పాఠశాల భవనాలను క్వారంటైన్ కేంద్రాల కోసం ఉపయోగించుకున్నారు.. ఇదే ఫార్ములాను ధారవిలోనూ అమలుచేశారు. ఇరుకిరుగా ఉండే ఆ మురికివాడలో హౌమ్ క్వారంటైన్ సాధ్యపడదనీ, దాంతో మొదటికే మోసం వొస్తుందని బీఎంసీ అధికారులు భావించారు. అందుకే వారికోసం ప్రత్యేకంగా క్వారంటైన్ సెంటర్ను బీఎంసీ ఏర్పాటుచేసింది. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా ధారవిలో దాదాపు 4 లక్షల మందికి పరీక్షలు నిర్వహించింది. లక్షణాలు ఉన్నవారిని ఐసొలేషన్ కేంద్రాలకు పంపింది. జ్వరం వచ్చిన వారిని పరీక్షించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మూత్రశాలలు, టాయిలెట్స్ ను రోజుకు రెండు సార్లు శానిటైజ్ చేసింది. ఇదే క్రమంలో అక్కడ ఉన్న వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపించడం, ఇక్కడ ఉంటున్నవారికి నిత్యావసరాలు పంపిణి చేయడం వంటి చర్యలతో వైరస్ వ్యాప్తిని సమర్ధవంతంగా అడ్డుకుంది. కేరళఇచ్చిన స్ఫూర్తి, అందించిన సాయం తోనే ధారవిలో కరోనా వైరస్ను అదుపులోకి తెచ్చామని బీఎంసీ అధికారి ఒకరు చెప్పడం విశేషం.