Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో డిమాండ్
న్యూఢిల్లీ : 'పీఎం కేర్స్ ఫండ్'ను ప్రజల ముందు పరిశీలనకు ఉంచాలని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సోమవారం ఒక ప్రకటనలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పీఎం కేర్స్ ఫండ్ వివరాలను వెల్లడించేందుకు ప్రధాన మంత్రి కార్యాలయం మొండిగా తిరస్కరించడాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఆక్షేపించింది. ప్రధాని చైర్మెన్గా, హోంశాఖ, ఆర్థిక, రక్షణ మంత్రులు ధర్మకర్తలుగా ఒక ప్రయివేటు ట్రస్టు ఈ ఫండ్ను ఏర్పాటు చేసినట్టు పీఎంఓ ప్రకటించిందని తెలిపింది. ఇది ఒక ప్రయివేటు ట్రస్టు కావున ఆర్టీఐ పరిధి, ప్రభుత్వ ఆడిటర్కు చెందిన ఆడిట్ కిందకు రాదని చెప్పుకొస్తున్నదనీ, దీన్ని చూస్తుంటేఈ ఫండ్కు సంబంధించిన వ్యవహరంలో ఎటువంటి పారదర్శకత, జవాబుదారీతనం లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని పొలిట్బ్యూరో పేర్కొంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడే సమయంలో ఈ ఫండ్ను ప్రకటించారనీ, కరోనాపై పోరులో భాగంగా ఈ ఫండ్కు ప్రజలు ఉదారంగా విరాళాలివ్వాలని ప్రభుత్వం ప్రజలకు బహిరంగంగా పిలుపునిచ్చిందని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు ఒక వేతనాన్ని కచ్చితంగా విరాళమివ్వాలని ఆదేశాలు జారీ చేశారనీ, ఇంకా ఈ ట్రస్టు ఫండ్కు రెండు సంవత్సరాలకు చెందిన ఎంపీ ల్యాడ్స్ నిధులను మళ్లించారని వివరించింది. 'కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటీ కంట్రిబూషన్' కింద ఈ ఫండ్కు విరాళాలను పొందేందుకు అర్హత కోసం కేంద్రం కంపెనీస్ యాక్ట్-2013ను సవరించిందని తెలిపింది. జాతీయ చిహ్నంతో పాటు ప్రధాని చిత్రాన్ని ఈ ఫండ్ను వినియోగిస్తోందనీ, ఈ నిధికి విరాళాలు అందించాలని ప్రభుత్వ రంగం సంస్థల్లోని ఉద్యోగులకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారని, ఇంకా ఈ నిధికి వచ్చే విరాళాలకు పన్ను మినహాయింపులు కూడా కల్పించారని పేర్కొంది.
ఒకవైపు దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి పారదర్శకంగా, జవాబుదారీతనం, కాగ్ ఆడిట్ పరిధిలో అధికారికంగా ప్రధాన మంత్రి ఆధ్వర్యంలో నేషనల్ రిలీఫ్ ఫండ్ అమల్లో ఉండగా, ప్రత్యేకంగా ఈ ప్రయివేటు ట్రస్టును ఎందుకు ఏర్పాటు చేశారన్న విషయంపై ఈరోజు వరకూ పీఎంఓ నుంచి సమాధానం లేదని పొలిట్బ్యూరో పేర్కొంది. ఈ ఫండ్ ద్వారా ఇప్పటికే దాదాపు రూ.10 వేల కోట్లు మేర సేకరించారని మీడియా నివేదికలు పేర్కొంటున్నాయని తెలిపింది. ఇందులో ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగుల నుంచి రూ.4 వేల కోట్లకు పైగా వచ్చాయనీ, ఇది ప్రభుత్వ అధికారం, మంజూరు కారణంగానే జరిగి ఉండొచ్చని అభిప్రాయపడింది.
మన దేశ ఆరోగ్య సదుపాయాలను మెరుగుపర్చేందుకు, కరోనా పరీక్ష పరికరాల కొరతను తీర్చేందుకు, వైరస్ మహమ్మారి బాధితులకు చికిత్స అందించేందుకు ఈ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. బహిరంగ టెండర్ల ప్రక్రియ లేకుండా ఈ నిధి నుంచి వెంటిలేటర్లను కొనుగోలు చేయడంపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో పాటు వివాదాలు బహిర్గతమయ్యాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ ఫండ్ను కచ్చితంగా పారదర్శకంగా నిర్వహించడంతో పాటు జవాబుదారీతనం కిందకు తీసుకురావాల్సిన అవసరం ఉందని పొలిట్బ్యూరో అభిప్రాయపడింది. కరోనాపై యుద్ధంలో ముందుభాగాన ఉండి పోరాడుతున్న రాష్ట్రాలకు వెంటనే ఈ నిధులను బదిలీ చేయాలని డిమాండ్ చేసింది. ఫండ్ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచడంతో పాటు వారి పరిశీలన కింద ఉంచాలని డిమాండ్ చేసింది.