Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఏఏ నిరసనల్లో పాల్గొన్న ఫలితం
అలీగఢ్ : దేశంలో ఒకవైపు కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంటే యోగి సర్కారు మాత్రం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేకులపై ప్రతీకార చర్యలకు పూనుకుంటున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా గత డిసెంబర్లో క్యాంపస్లో చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ) విద్యార్థి షార్జీల్ ఉస్మానీని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం ఆజాంగర్లోని సిధారీ పట్టణంలో గల ఆయన ఇంటి నుంచి ఉస్మానీని అదుపులోకి తీసుకున్నారు. సాదాసీదాగా వచ్చిన ఐదుగురు వ్యక్తులు ఉస్మానీ ఇంటి గుమ్మం ముందు నిలబడ్డారనీ, తమను తాము క్రైం బ్రాంచ్కు చెందిన పోలీసులుగా పరిచయం చేసుకున్నారని ఉస్మానీ సోదరుడు వివరించారు. ''నీకు మా గురించి తెలుసుకోవాల్సినవసరం లేదు. మేము ఇక్కడ ఎందుకు ఉన్నామో ఉస్మానీకి తెలుసు'' అని వారిలో ఒకరు తనతో అన్నట్టు తెలిపాడు. ఎలాంటి ఐడీ కార్డు చూపకుండానే వారు ఉస్మానీ గదిని చూడాలని వారు డిమాండ్ చేసినట్టు చెప్పారు. ఉస్మానీ ల్యాప్టాప్, అన్ని పుస్తకాలు, దుస్తులులను వారు స్వాధీనం చేసుకున్నారని ఆయన వివరించారు. దేని ఆధారంగా ఉస్మానీని అరెస్టు చేశారో వారు మాకు చెప్పలేదనీ, నా కొడుకుతో మాట్లాడటానికీ అనుమతించలేదని ఉస్మానీ తండ్రి తరీఖ్ ఉస్మానీ చెప్పారు. అలీగఢ్లో గత డిసెంబర్లో దాఖలైన కేసుకు సంబంధించి ఉస్మానీని లక్నో పోలీసులకు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసిందని అలీగఢ్ పోలీసు అధికారి అమర్ ఉజాలా తెలిపారు. కాగా, సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న ఉస్మానీతో పాటు ఏఎంయూకు చెందిన పలువురు ప్రస్తుత, మాజీ విద్యార్థుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చిన పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.