Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రాజస్థాన్ లో ఎస్బీఐ నిర్వాకం
- రైతులు రుణాలు తీసుకోకున్నా బలవంతంగా వడ్డీ వసూలు
- ప్రాసెసింగ్ ఫీజు పేరిట బ్యాంకు అధికారుల మాయాజాలం
జైపూర్ : నిరక్షరాస్యులైన రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) అక్రమాలకు పాల్పడుతున్నది. రైతులు ఎలాంటి కారు రుణాలు తీసుకోకపోయినా... వారి నుంచి 'కార్ లోన్ ఈఎంఐ' వసూలు చేస్తున్నది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం.. రాజస్థాన్లో చోటు చేసుకుంది. కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) ఖాతా ఉన్న ఖాతాదారుల నుంచి రూ. 2 వేల నుంచి రూ. 5 వేల దాకా వసూలు చేస్తున్నది. అయితే రైతులెవరూ తమకు కారు రుణాలు కావాలని బ్యాంకు అధికారులను అడగకపోవడం ఇక్కడ గమనార్హం.
వివరాల్లోకెళ్తే... హనుమాన్ గఢ్ జిల్లా రాంగఢ్ ఎస్బీఐ బ్రాంచ్ అధికారులు, చుట్టుపక్కల ఉండే గ్రామాలకు చెందిన పలు రైతుల కేసీసీ ఖాతాల నుంచి 'ప్రో కార్ లోన్' కింద ఈఎంఐ లను వసూలు చేస్తున్నారు. రాంగఢ్ కు చెందిన రైతు సుఖ్ దేవ్ ఖాతా నుంచి ఈ నెల 1 న రూ. 1,842 కట్ అయ్యాయి. అదే విధంగా నోహర్ కు చెందిన శ్రవణ్ కుమార్ ఖాతాలోంచి ఈ ఏడాది జనవరి 2 న రూ. 4,382 డెబిట్ అయ్యాయి. ఇదే క్రమంలో రాంగఢ్ నివాసి రాజేంద్రకుమార్ ఖాతాలోంచి రూ. 3,906 ను కట్ చేశారు. వీరితోపాటు చాలామంది అన్నదాతల బ్యాంకు ఖాతాల్లోంచి కారు రుణం కింద బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే రైతులెవరూ తమకు విలాసవంత వాహనాలు కావాలని బ్యాంకు అధికారులకు అర్జీ పెట్టుకోలేదు. అయితే రైతులందరి ఖాతాల్లోంచి ఏదో ఒక నెల డబ్బులు కట్ అవుతున్నాయని ఆ ఏరియాలో వార్తలు గుప్పుమన్నాయి. దీంతో రైతులు ఆలిండియా కిసాన్ సభ (ఏఐకేఎస్)ను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన ఏఐకేఎస్ ప్రతినిధులు.. నిజాన్ని నిగ్గు తేల్చారు.
రైతులకు రుణాలను ఇచ్చే పేరుతో వారికి కేసీసీ కార్డులను అందించిన విషయం విదితమే. దీని కింద అప్పులను ఇచ్చిన ఎస్బీఐ.. వడ్డీల పేరిట రైతులను మోసం చేస్తున్నది. ఇదేంటని ప్రశ్నిస్తే.. బ్యాంకు అధికారులు తమనే బెదిరిస్తున్నారనీ, చదువు లేని కారణంగా తాము ఈ విషయాలను తెలుసుకోలేకపోతున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. ఇదే విషయమై రాజేంద్రకుమార్ అనే రైతు స్పందిస్తూ.. 'మాకు చదువు రాదు. మేమేం చెప్పినా వాళ్ళు మా మాట వినిపించుకోరు. దీని గురించి బ్యాంకు డిప్యూటీ మేనేజర్ ను అడిగితే ఆయన చాలా తేలికగా కారు కోసం లోన్ తీసుకున్నందుకు కట్ అయిందని చెప్పాడు' అని వాపోయాడు. మరో రైతు కుమార్ మాట్లాడుతూ.. 'ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క పైసా ఎంతో విలువైనది. ఈ సమయంలో బ్యాంకులు మా వద్ద నుంచి వేలకు వేలు వసూలు చేస్తే మేమెట్లా బతికేది' అని ప్రశ్నించాడు.
గతం'లోనూ' అంతే...
రైతుల దగ్గర్నుంచి ఇలా బలవంతంగా వసూలు చేయడం ఎస్బీఐకి ఇదేం కొత్త కాదు. గతంలో రైతుల ఖాతాలలో పడ్డ ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పరిహారాన్ని సైతం.. వారి రుణాల కిందే వసూలు చేసుకుంది. 2018 ఖరీఫ్ సీజన్లో .. పంట నష్టాలకు సంబంధించి అన్నదాతల ఖాతాల్లో జమైన నగదును వారి అనుమతి లేకుండానే బ్యాంకు దగ్గర తీసుకున్న రుణాల కిందే చూపించింది. ఇలా దాదాపు 500 మంది రైతుల నుంచి రూ. 64 లక్షలను రైతుల సమ్మతి లేకుండా కట్ చేసుకుంది. సుమారు 3 వేలకు మందికి పైగా రైతులకు చెందిన ఫసల్ భీమా యోజన క్లైములను వారికి చెల్లించలేదని గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి.
టెక్నికల్ తప్పులు అంటూ బుకాయింపు..
రైతుల నగదును అక్రమంగా కట్ చేస్తున్న బ్యాంకు అధికారులు.. ఈ విషయం బయటకి పొక్కేసరికి సాంకేతిక తప్పులని చూపుతూ బుకాయిస్తున్నారు. ఇదే విషయం పై రాంగఢ్ ఉజ్జల్వ ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ నవీన్ ప్రియదర్శిని వివరణ కోరగా ఆయన స్పందిస్తూ.. 'రైతుల మీద ఎటువంటి కార్ల రుణాలూ వసూలు చేయడం లేదు. ఇప్పుడు కట్ అయినా నగదు కేసీసీ ఖాతాలు రెన్యువల్ చేయడం కోసం ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే. కానీ పాసుబుక్కుల్లో మాత్రం కంప్యూటర్ లలో తలెత్తిన సాంకేతికలోపం కారణంగా తప్పుగా ప్రింట్ అయింది' అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆయన చెప్పినట్టు.. రైతుల దగ్గర వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజుకు ప్రత్యేకించి ఒక కాలమ్ (ఎంట్రీ) ఉంది. ఉదాహరణకు... మంజూ అనే ఒక మహిళా రైతు ఖాతా నుంచి 2019 డిసెంబర్ 20 న 'కార్ లోన్' కింద రూ. 2,630 కట్ చేశారు. గతేడాది ఆగస్టు 28 న 'ప్రాసెసింగ్ ఫీ ఫర్ 2019-20' కోసం రూ. 2,233 డెబిట్ చేసినట్టు ఆమె పాసుబుక్ లో నమోదయింది.
కప్పి పుచ్చుకునే ప్రయత్నం : ఏఐకేఎస్
ఇలాంటి అక్రమాలకు పాల్పడినప్పుడల్లా ఎస్బీఐకి 'సాంకేతిక తప్పిదం' అని చెప్పుకునే అలవాటు ఉందని ఏఐకేఎస్ సభ్యుడు దిలీప్ బంబు ఆరోపించారు. ప్రాసెసింగ్ ఫీజుల కోసం ప్రతి ఏడాది కొంత మొత్తాన్ని కట్ చేసుకుంటున్నప్పుడు.. మళ్లీ కార్ లోన్ ఈఎంఐ ని ప్రాసెసింగ్ ఫీజు అంటే ఎలా నమ్ముతామని ప్రశ్నిచారు. బ్యాంకు అధికారులు చెప్పేది నమ్మశక్యంగా లేదని అన్నారు. రైతుల వద్ద నుంచి కట్ చేసిన మొత్తాన్ని తిరిగి వారికే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.