Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-భూ హక్కుల కోసం 3 లక్షలకు పైగా దరఖాస్తులు..
- ఇచ్చింది 716 మందికి..
- పత్రాలు లేవని గిరిజనులపై దాడులకు దిగుతున్న ఫారెస్ట్ అధికారులు..
- మధ్యప్రదేశ్ లో చోద్యం చూస్తున్న బీజేపీ సర్కారు
భోపాల్ : అడవుల నుంచి ఆదివాసులను వెళ్లగొట్టి.. అక్కడ ఉన్న వేలకోట్ల రూపాయల సంపదను కార్పొరేట్లకు అప్పగించడానికి మధ్యప్రదేశ్ లోని బీజేపీ సర్కారు వేగంగా పావులు కదుపుతోంది. వారికి చట్టబద్ధంగా దక్కాల్సిన అటవీ హక్కులను హరించివేస్తూ.. గిరి పుత్రులను అడవుల నుంచి పంపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగానే 3.79 లక్షల మంది భూ హక్కుల కోసం దరఖాస్తులు చేసుకోగా.. వారిలో 716 మందికే (0.18 శాతం) ఆమోదం తెలపడం గమనార్హం. అప్లికేషన్లను తిరస్కరించిన వాటిలో అధిక భాగం.. దరఖాస్తుదారులు సరైన పత్రాలు సమర్పించలేదని తొలగించినవే. తొమ్మిది నెలలుగా సాగుతున్న ఈ ప్రక్రియ మరో నెల రోజుల్లో ముగియనుండటంతో ఆదివాసుల్లో ఆందోళన మొదలైంది. ఇదిలాఉండగా తిరస్కతి పొందిన వ్యక్తులపై అటవీ శాఖ అధికారులు ఇప్పటికే దాడులు ప్రారంభించారు. వారి ఇండ్లను, పంటలను తగులబెడుతూ.. గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
గతేడాది ఫిబ్రవరి 13 న సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు.. అడవుల్లో ఉంటున్న గిరి పుత్రులంతా అందుకు సంబందించిన పత్రాలను సమర్పించాలనీ, లేకుంటే వారిని అడవుల నుంచి పంపించాలని తీర్పు చెప్పింది. దీంతో ఆదివాసులను గుర్తించే విధానంలో అక్రమాలకు చెక్ పెట్టడానికోసమని 2019 అక్టోబర్ 2 న రాష్ట్ర ప్రభుత్వం ఃవనమిత్రః యాప్ ను ప్రారంభించింది. ఈ ప్రక్రియనంతా యాప్ ద్వారానే నిర్వహిస్తున్నారు. మూడు దశల్లో.. గ్రామ, సబ్ డివిజనల్ (రెవెన్యూ), జిల్లా స్థాయిల్లో దరఖాస్తులను పరిశీలిస్తున్నారు.
రాష్ట్ర గిరిజన మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. మొత్తం అప్లికేషన్లలో 2.85 లక్షల దరఖాస్తులను 2018 -19 లోనే తిరస్కరించారు. కొత్తగా మరో 93,507 దరఖాస్తులు వచ్చినా అవీ పెండింగ్ లోనే ఉన్నాయి. ఇక మూడు స్థాయిల పరిశీలన ప్రక్రియలో భాగంగా.. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నడుస్తున్న 46 వేల ఃఫారెస్ట్ రైట్ కమిటీస్ః 1.33 లక్షల అప్లికేషన్లను స్వీకరించాయి. అందులో 98,742 పరిశీలించగా.. 34,860 అప్లికేషన్లకు ఆమోదముద్ర వేసాయి. ఇవి రెవెన్యూ ఆఫీస్ లకు చేరేసరికి అందులో 6,177 ని ఆమోదించి పైకి పంపారు. ఇక ఇవి జిల్లా స్థాయికి వచ్చేసరికి.. 716 మాత్రమే సక్రమంగా ఉన్నాయని తేల్చారు. అంటే గడిచిన తొమ్మిది నెలల్లో 3.79 లక్షల మంది తమ హక్కుల కోసం అడిగితే.. జులై 6 నాటికి వారిలో 700 మంది మాత్రమే అన్ని రకాల పత్రాలున్నాయని తేల్చారు.
పత్రాల నిరూపణ గడువు ముంచుకొస్తుండటంతో అడవి బిడ్డలలో ఆందోళన ప్రారంభమైంది. ఈ నెల 31 చివరి తేదీ కావడంతో వారు భయంభయంగా గడుపుతున్నారు. అయితే దీనిపై అధికారులు స్పందిస్తూ.. మరో నెల గడువు పెంచాలని కోర్టును కోరతామనీ, ఆలోపు ప్రక్రియ పూర్తి చేస్తామని చెబుతున్నారు. కానీ 9 నెలల్లో 0.18 శాతం మందినే గుర్తించిన రాష్ట్ర సర్కారు.. నెలలో మిగతా పని ఎలా పూర్తి చేస్తుందని అటవీ హక్కుల కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. వందలాది గిరిజన గ్రామాల్లో గ్రామపంచాయతీలు లేవనీ, అటువంటప్పుడు వారిని గుర్తించే ప్రక్రియను ఎట్లా చేపడతారని వారు అడుగుతున్నారు. అసలు వారిని గుర్తించే విధానం లోనే లోపాలున్నాయని ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై మానవర్ కు చెందిన కాంగ్రెస్ ఎంఎల్ఏ హీరాలాల్ స్పందిస్తూ.. దీని వెనక రాష్ట్ర ప్రభుత్వ కుట్ర దాగి ఉన్నదని ఆరోపించారు. వనమిత్ర యాప్ ల పనితీరు సరిగా లేదనీ, కానీ సర్కారు మాత్రం వాటి ద్వారానే డేటా సేకరిస్తూ గిరిజనులకు తీరని అన్యాయం చేస్తుందన్నారు. దీనిని తాము అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.