Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : 'కోడ్ ఆన్ వేజెస్ బిల్లు'ను సెప్టెంబరు నుంచి అమల్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్టు కేంద్రం తెలిపింది. ముసాయిదా బిల్లులో పొందుపర్చిన అంశాలు, నిబంధనలు కేంద్ర కార్మిక శాఖ వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచామని మంత్రిత్వశాఖలోని ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కార్మిక సంస్కరణల్లో ఒకటైన 'ద కోడ్ ఆన్ వేజెస్, 2019' బిల్లుకు గత ఏడాది ఆగస్టులో పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇప్పటివరకూ అమల్లో ఉన్న కనీస వేతనం చట్టం, వేతన చెల్లింపు చట్టం, బోనస్ చట్టం, సమాన వేతన చట్టం...ఈ నాలుగింటిలో పలు మార్పులు చేసిన మోడీ సర్కార్, వాటి స్థానంలో 'కోడ్ ఆన్ వేజెస్ బిల్లు'ను అమల్లోకి తీసుకొస్తున్నది. దీనిపై వామపక్షాలు, కార్మికసంఘాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. కార్మిక, ఉపాధిరంగంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించకుండా, కేవలం కార్పొరేట్ కంపెనీలు, వాటి యాజమాన్యాలకు అనుకూలించే నిబంధనలు పొందుపర్చి కొత్త చట్టాలు చేయటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. 44 కేంద్ర కార్మిక చట్టాల స్థానంలో కోడ్ ఆన్ వేజెస్, ఇండిస్టియల్ రిలేషన్స్, సోషల్సెక్యూరిటీ, ఆక్యుపేషనల్ హెల్త్, సేప్టీ...అనే నాలుగు చట్టాలను కేంద్రం తీసుకురాబోతున్నది.