Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకేరోజు 26,506 మందికి కరోనా
- 475 మరణాలు
- దేశంలో మొత్తం 21,604 వైరస్ మరణాలు
- కోవిడ్-19 మరణాల్లో 85 శాతం మంది 45 ఏండ్లకు పైబడినవారే : కేంద్రం
- నల్లబజార్లో ''రెమిడెసివిర్''.. భారీ డిమాండ్తో రికార్డు ధరలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) పంజా విసురుతున్నది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత వారం రోజుల్లో రోజువారిగా సగటున 23 వేలకు పైగా కొత్త కేసులు నిర్ధారణ అవుతున్నాయి. తాజాగా శుక్రవారం సాయంత్రం పలు రాష్ట్రాలు వెల్లడించిన కోవిడ్-19 వివరాల ప్రకారం.. దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 8 లక్షలకు చేరింది. అయితే, శుక్రవారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన కోవిడ్-19 హెల్త్ బులిటెన్ వివరాల ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 26,506 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వెలుగు చేసినప్పటినుంచి రోజువారిగా నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. ఇదే సమయంలో 475 మంది వైరస్తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా రోగుల మరణాల సంఖ్య 21,604కు పెరిగింది. వైరస్ బాధితుల సంఖ్య 7,93,802కు చేరింది. ప్రస్తుతం 2,76,685 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే, కరోనా బారినపడుతున్న వారితో పాటు కోలుకుంటున్న వారి సంఖ్య సైతం గణనీయంగా పెరుగుతున్నది. ఇప్పటివరకూ దేశంలో 4,95,513 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. కోవిడ్-19 బాధితుల రికవరీ రేటు ప్రస్తుతం 62.09 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది మే 31న 47 శాతంగా ఉందని తెలిపింది. కాగా, కరోనా మరణాల్లో 45 ఏండ్లకు పైబడిన వారే అధికంగా ఉన్నారని కేంద్రం వెల్లడించింది. వీరు 85 శాతం మంది ఉన్నారని తెలిపింది. అయితే, 60 ఏండ్లలకు పైబడిన వారు 53 శాతం మంది కరోనా మృతులు ఉన్నారు. కోవిడ్-19 సోకిన వారిలో 14 ఏండ్లకు లోబడివున్న వారు 1శాతం, 15-29 ఏండ్లు ఉన్నవారిలో 3 శాతం, 30-44 ఏండ్లు ఉన్నవారిలో 11శాతం, 60-74 ఏండ్ల మధ్య వయస్సు ఉన్నవారిలో 39 శాతం మరణాలు చోటుచేసుకున్నాయి. అలాగే, 75 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు ఉండి కరోనా బారినపడ్డవారిలో 19 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు.
రెమిడెసివిర్తో బ్లాక్మార్కెట్ దందా !
కరోనా చికిత్సలో అత్యవసరంగా ఉపయోగించే రెమిడెసివిర్ ఔషధం ఇప్పుడు అక్రమార్కుల చేతుల్లో చిక్కి నల్లబజారుకు చేరుకుంది. బాధితుల ప్రాణాలను తమ జేబులు నింపుకునే ముడిసరుకుగా ఉపయోగించుకుంటూ.. ఈ ఔషధం ధరను వేలకు వేలు పెంచేసి విక్రయిస్తున్నారు. బాధితుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ దీని ధర సైతం పెరుగుతుండటం గమనార్హం. ఢిల్లీ బ్లాక్ మార్కెట్లో నిన్న మొన్నటి వరకు రెమిడెసివిర్ ధర రూ.15 వేలు ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.35 వేలకు చేరుకోవడం చూస్తుంటే అక్రమార్కులు ఎలా చెలరేగిపోతున్నదీ అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ, గురుగ్రామ్ ప్రాంతాల్లోని బ్లాక్ మార్కెట్లో రెమిడెసివిర్ అందుబాటులో ఉన్నా.. అధీకత డీలర్ల వద్ద మాత్రం లేకపోవడం చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తమిళనాడులో మరో మంత్రికి కరోనా
చెన్నై: తమిళనాడులో కరోనా విజృంభన కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి పాలనా యంత్రాంగం వరకూ ఎవరినీ కరోనా వదలడం లేదు. అయితే, రాష్ట్ర మంత్రివర్గం వైరస్ మహమ్మారి బారినపడటంతో తీవ్ర కలవరం మొదలైంది. ఇటీవల ఇద్దరు రాష్ట్ర మంత్రులు కోవిడ్-19 బారినపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా సహకార మంత్రి సెల్లూరు కె. రాజుకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈయనతో కలిపి రాష్ట్ర క్యాబినెట్లో ముగ్గురు మంత్రులు కరోనా బారినపడ్డారు. విద్యుత్ మంత్రి తంగమణి, ఉన్నత విద్యామంత్రి కెపి. అన్బగన్ కరోనా సోకిన వారిలో ఉన్నారు. వీరు ముగ్గురితో పాటు రాష్ట్రానికి చేందిన మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. కాగా, రాష్ట్రలో తాజాగా 3,680 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 64 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,829కి పెరిగింది. వైరస్ బాధితుల సంఖ్య 1,30,261కి చేరింది.
మేఘాలయాలో మరో 26 మంది బీఎస్ఎఫ్ సిబ్బందికి..
కరోనా కట్టడిలో భాగంగా మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో 26 మంది బీఎస్ఎఫ్ సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్టు వైద్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఉన్న బీఎస్ఎఫ్ విభాగంలో కరోనా కేసుల సంఖ్య 91కి పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మరికొంత మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సివుందని తెలిపింది. కాగా, దేశవ్యాప్తంగా బీఎస్ఎఫ్లో తాజాగా మొత్తం 73 మందికి కరోనా సోకిందనీ, దీంతో మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 1,659కి చేరిందని సంబంధిత అధికారులు వెల్లడించారు.
కర్నాటకలో 'ఆశా'ల విధుల బహిష్కరణ..
- పీపీఈ కిట్లు ఇప్పించటంలో బీజేపీ సర్కారు విఫలం
- కరోనాతో ఇప్పటికే ఇద్దరు మృతి
బెంగళూరు : కర్నాటకలో కరోనాకు ఎదురొడ్డి పోరాడుతున్న 'ఆశా'లకు భద్రత కల్పించటంలో యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ సర్కారు విఫలమైంది. రాష్ట్రంలో కరోనా కేసుల విజంభిస్తున్నా.. ప్రజల మధ్య తిరుగుతూ వారికి పరీక్షలు నిర్వహించడం, వైద్య సదుపాయాలు కల్పించడంలో ఆశా వర్కర్లు ముందుపీఠిన ఉన్నారు. అయినా ప్రభుత్వం మాత్రం వారిపై చిన్న చూపు చూస్తున్నది. దీంతో.. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలనీ, రక్షణ కిట్లు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరిస్తున్నట్టు ఆశాలు ప్రకటించారు. తమకు నెలకు రూ. 12 వేల వేతనం చెల్లించాలనీ, కేంద్రం ప్రకటించిన గౌరవ వేతనాన్నీ అందించాలని వారు డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు విజంభిస్తున్న తరుణాన ఆశా వర్కర్లు పొద్దస్తమానం పని చేస్తున్నారు. పాజిటివ్ కేసులు నమోదైన చోట ప్రయిమరీ కాంటాక్టులను గుర్తించటం, అక్కడ ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి చికిత్స అందించడం వంటివి విరివిగా చేపడుతున్నారు. ఈ క్రమంలో కల్బుర్గి, యాద్గిర్కు చెందిన ఇద్దరు ఆశా వర్కర్లు కరోనా సోకి చనిపోయారు. తమకు చాలినన్ని పీపీఈ కిట్లు లేవనీ, వాటిని త్వరగా అందించాలని సర్కారును కొద్దికాలంగా కోరుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరేవరకూ విధుల్లో చేరబోమని కర్నాటక సంయుక్త ఆశా వర్కర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ కె. సోమశేఖర్ తెలిపారు.