Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాన్పూర్కు తీసుకొచ్చే క్రమంలో కాల్చివేత
- పట్టుకున్న 24 గంటల్లోపే హతం
- పోలీసుల అదుపులోకి అతడి భార్య, కుమారుడు
లక్నో : ఉత్తరప్రదేశ్లో 8 మంది పోలీసులను హతమార్చిన ముఠా నాయకుడు వికాస్ దూబే కథ ముగిసింది. శుక్రవారం ఉదయం అతడు యూపీ పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ అయ్యాడు. రెండ్రోజుల క్రితం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో పట్టుబడ్డ అతడిని.. అక్కడి నుంచి కాన్పూర్ తీసుకొస్తుండగా మార్గమధ్యలో హతమయ్యాడు.
కాన్పూర్ ఏఎస్పీ అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... పోలీసు కాన్వారులో దూబేను ఉజ్జయిని నుంచి కాన్పూర్కు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో కాన్పూర్కు సమీపంలోని సచ్చేంద్రి వద్దకు రాగానే కాన్వారులోని ఓ వాహనం బోల్తా పడింది. ఇదే అదునుగా భావించిన దూబే.. ఓ కానిస్టేబుల్ వద్ద ఉన్న పిస్టల్ను లాక్కొని వారిని కాల్చబోతూ, పారిపోయేందుకు యత్నించాడు. లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినా వినకుండా వారిపైకి కాల్పులకు దిగాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడ్డ దూబేను ఆస్పత్రికి తరిలించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు ఎదురుకాల్పులు, కారు బోల్తా పడ్డ ఘటనలో ఆరుగురు పోలీసులకు గాయాలైనట్టు అనిల్ కుమార్ వెల్లడించారు.
దూబే భార్య, కుమారుడు అరెస్ట్
60 క్రిమినల్ కేసుల్లో నిందితుడుగా ఉన్న వికాస్ దూబే ఉజ్జయినిలో పట్టుబడగానే పోలీసులు లక్నోలోని కష్ణానగర్లో ఉన్న అతడి భార్య, కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. వారం రోజుల క్రితం 8 మంది పోలీసులను హతమార్చిన ఘటనలో దూబే భార్యపైనా పోలీసులు ఆరోపణలు మోపారు. ఈ కేసులో పోలీసులు వారిని విచారిస్తున్నారు.
భిన్నాభిప్రాయాలు..
దూబే ఎన్కౌంటర్ పై రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. ఇక సామాజిక మాధ్యమాల్లో అయితే నెటిజన్లు రెండు గ్రూపులుగా చీలిపోయి ఈ విషయం మీద జోరుగా చర్చలు జరుపుతున్నారు. కాగా, ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకురాలు, యూపీ ఇన్ఛార్జీ ప్రియాంక గాంధీ స్పందిస్తూ.. 'నేరగాడు హతమయ్యాడు. కానీ, ఇన్నాళ్లు అతడిని కాపాడినవాళ్లు సురక్షితంగా ఉన్నారు' అంటూ ట్వీట్ చేశారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. 'కారు పల్టీలు కొట్టలేదు. అతడు నోరు విప్పి వాస్తవాలు బయటపెడితే... బీజేపీ సర్కారు ఎక్కడ పల్టీలు కొడుతుందోనని రహస్యాలను ఎన్కౌంటర్ చేశారు' అని వ్యాఖ్యానించారు. రిటైర్డ్ పోలీస్ అధికారి ఒకరు స్పందిస్తూ... 'వికాస్ దూబే హతమయ్యాడా..? నిజమా..? పోలీసుల దగ్గర్నుంచి పిస్టల్ తీసుకొని పారిపోవడానికి ప్రయత్నించాడా..! అదే పాత కథే.. ఇందులో కారు పల్టీలు కొట్టటం కొత్తది... ఈ కహానీలను ఎవరు నమ్ముతారు..? ఇది పూర్తిగా ఘటనను కప్పిపుచ్చడం లాంటిదే..' అంటూ చేసిన ట్వీట్ ట్విట్టర్లో దుమారం రేపింది. మరోవైపు ప్రభుత్వమేమో.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎప్పటిలాగే ప్రతిపక్షాల ఆరోపణలను కొట్టిపారేసింది.