Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంగన్ వాడీల ''లల్కార్ దివస్'' ఆందోళన
- మూడు లక్షల మంది భాగస్వామ్యం
నవతెలంగాణ బ్యూరో - న్యూఢిల్లీ
దేశంలో ఐసీడీఎస్కు కేటాయింపులు రెట్టింపు చేయాలని అంగన్ వాడీ వర్కర్స్, హెల్పర్స్ సంఘం నేతలు డిమాండ్ చేశారు. 12 డిమాండ్ల సాధనకు శుక్రవారం దేశవ్యాప్తంగా సీఐటీయూ అనుబంధం అలిండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ (ఎఐఎఫ్ఏడబ్ల్యుహెచ్) ఆధ్వర్యంలో ''లల్కార్ దివస్ (సవాల్ డే)'' ఆందోళన జరిగింది. ''ఐసీడీఎస్ని ఇప్పుడే బలోపేతం చేయండి.. మూడు లక్షల మంది పిల్లలు చనిపోవడాన్ని అనుమతించకండి'' అనే నినాదంతో దేశవ్యాప్తంగా మూడు లక్షల మంది అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ పాల్గొన్నారు. కరోనా వైరస్ విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ సేఫ్టీ గేర్ (భద్రత), ఇన్సురెన్స్, రిస్క్ అలవెన్స్ కోరుతూ ఎరుపు దుస్తులు, ఎరుపు మాస్క్ ధరించి ఆందోళనలో పాల్గొన్నారు. కార్మికులుగా గుర్తింపు, కనీస వేతనాలు, పెన్షన్, సామాజికి భద్రత, ఐసీడీఎస్లో పోషకాహారం కోసం కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్నాటక, బీహార్, అసోం, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, పుదిచ్చేరి, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర 22 రాష్ట్రాల్లోనూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఆందోళన జరిగింది. ఢిల్లీలోని సీఐటీయూ కేంద్ర కార్యాలయం (బీటీఆర్ భవన్)లో జరిగిన సంఘీభావ ఆందోళనలో సీఐటీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. హేమలత, తపన్ సేన్, కోశాధికారి ఎంఎల్ మాల్కోటియా, ఉపాధ్యక్షులు జెఎన్ మజూంధర్, జాతీయ కార్యదర్శి ఎస్.దేవ్రారు, ఏఐఎఫ్ఏడబ్ల్యుహెచ్ కోశాధికారి అంజుమణి తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీల సమస్యలపై కేంద్ర మౌనం : సింధూ
ఏఐఎఫ్ఎడబ్ల్యుహెచ్ ప్రధాన కార్యదర్శి ఎఆర్ సింధూ మాట్లాడుతూ కరోనా మహమ్మారిపై 26 లక్షల మంది అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, ఆశా కార్మికులు ముందు వరుసలో పోరాడుతున్నారన్నారు. ఇంటింటికి వెళ్లి తమ ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. లబ్ధిదారులకు పోషకాహారం, కరోనా సంబంధిత సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడం, రోగుల సర్వే నిర్వహించడం, వారిని ఆసుపత్రికి తీసుకెళ్లడం, వృద్ధులకు, పేదలకు సామాజిక భద్రత, పెన్షన్ ఇవ్వడం, క్వారెంటైన్ కేంద్రాల్లోని రోగులను పర్యవేక్షించడం వంటి పనులు కూడా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్సే చేస్తున్నారని తెలిపారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు, ఆశా కార్యకర్తలకు ఎటువంటి భద్రతా సామాగ్రిని అందించటం లేదని, ఏ బీమా పథకం వర్తించటం లేదని పేర్కొన్నారు. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్కు కరోనా వైరస్ సోకడం, కరోనాతో మరణించిన కేసులు దేశంలో అనేక రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చాయని తెలిపారు. దేశంలో ప్రతిఏటా పోషకాహారం లోపం, మెజార్టీ పేద ప్రజలకు ఆహారం అందించే చర్యలు నిర్ధారించకపోవడంతో తొమ్మిది లక్షల మంది చిన్నారులు మరణిస్తున్నారని, ఈ ఏడాది మరో మూడు లక్షల మంది చిన్నారులు మరణిస్తారని యూనిసిఫ్ హెచ్చరించిందని గుర్తు చేశారు. కానీ ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో రేషన్ సరఫరాను కూడా నిలిపివేసి, నగదు బదిలీతో భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. కాబట్టీ మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా లాల్కర్ దివాస్ (ఛాలెంజ్ డే) నిర్వహించామని ఎఆర్ సింధూ పేర్కొన్నారు. అధికారుల బెదిరింపులు ఉన్నప్పటికీ మహమ్మారి వ్యాప్తిని నివారించడానికి భద్రతా చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించే అంగన్ వాడీ వర్కర్, హెల్పర్స్ చాలా క్రమ శిక్షణతో భౌతిక దూరం పాటించి, అన్ని నిబంధనలు పాటిస్తూ ప్రాజెక్టు ప్రధాన కార్యాలయంలో లాల్కర్ దివాస్ను చేపట్టారని తెలిపారు. ఆందోళనలో స్థానిక అధికారుల నుంచి డబ్ల్యుసిడి మంత్రి, ప్రధాన మంత్రి వరకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు సమర్పించినట్లు చెప్పారు.