Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.3,688కోట్ల రుణాన్ని ఎగవేసిన డీహెచ్ఎఫ్ఎల్
- మొండి బకాయిగా ప్రకటించిన పీఎన్బీ
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ బ్యాంకు... పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)లో మరో భారీ ఆర్థిక కుంభకోణం బయటపడింది. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్)కు ఇచ్చిన 3,688.58కోట్ల రుణంలో ఆర్థిక మోసం చోటు చేసుకుందని పీఎన్బీ తాజాగా ఆర్బీఐకి తెలిపింది. ముంబయిలోని పీఎన్బీ కార్పొ రేట్ శాఖ నుంచి డీహెచ్ఎఫ్ఎల్కు ఈ రుణం మంజూరైందనీ, అదిప్పుడు మొండి బకాయిగా మారిందని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పీఎన్బీ తెలిపింది. ఈ విషయాన్ని ఆర్బీఐకి తెలియజేశామని అందులో పేర్కొన్నారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సంస్థ అయిన 'డీహెచ్ఎఫ్ఎల్' వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు రూ.లక్ష కోట్లు దాటాయి. వీటికి సంబంధించిన చెల్లింపులు చేయటంలో సంస్థ విఫలమైంది. దాంతో కంపెనీ దివాలా ప్రకటించింది. గత కొద్ది నెలలుగా కంపెనీ ప్రమోటర్లు విచారణను ఎదుర్కొంటున్నారు. వేలకోట్ల రూపాయల రుణాలు ఎటు మళ్లించారన్న దిశగా విచారణ సాగుతున్నది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాల్ని కూడా డీహెచ్ఎఫ్ఎల్ ఎగవేసింది. ఈ రుణాల్ని మొండి బకాయిలుగా ఎస్బీఐ, యూనియన్బ్యాంకు ఇప్పటికే ప్రకటించాయి. దేశంలో మూడో అతిపెద్ద బ్యాంకు అయిన పీఎన్బీలో వరుస ఆర్థిక నేరాలు బ్యాంకింగ్రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, పీఎన్బీ బ్యాంకుకు రూ.11,300కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోవటం దేశవ్యాప్తగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత వరుసగా మరో రెండు భారీ ఆర్థిక నేరాలు పీఎన్బీలో చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం డీహెచ్ఎఫ్ఎల్ ఆర్థికమోసం పీఎన్బీలో నాలుగవది. ఈ ఏడాది జూన్ నాటికి మొండి బకాయిలు(ఎన్పీఏ) రూ.73,500కోట్లకు చేరుకున్నాయని పీఎన్బీ ప్రకటించింది. ఆగస్టు 4 బ్యాంకు 19వ సాధారణ సమావేశం జరగనున్నది.