Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమాలను ఆర్డినెన్స్ అడ్డుకుంటుందా!
- మోడీ వచ్చాక మూతబడిన బ్యాంకులు 127
- ఖాతాదార్లకు చెల్లింపులు చేయలేక చేతులెత్తేస్తున్నాయి : ఆర్థిక నిపుణులు
- యస్ బ్యాంకు, పీఎంసీ బ్యాంకు అక్రమాలెన్నో..
న్యూఢిల్లీ : సహకార బ్యాంకుల విషయంలో మోడీ సర్కార్ ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్ వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంకింగ్ రంగంపై ప్రజలకు నమ్మకం పోతున్నదనీ, ఖాతాదార్ల సొమ్ముకు భద్రత ఉండటం లేదని వారి వాదన. సహకార బ్యాంకుల్లో ఇటీవల బయటపడుతున్న ఆర్థిక మోసాలు అడ్డుకోవడానికి అనేక విధానాలున్నాయి. వాటిని వదిలేసి సర్వహక్కులూ ఆర్బీఐకి కట్టబెడుతూ ఆర్డినెన్స్ ఇస్తే సరిపోదు. యస్ బ్యాంకు, పంజాబ్, మహారాష్ట్ర సహకార బ్యాంకు ఆర్థిక మోసాలు... మళ్లీ జరగకుండా ఆర్డినెన్స్ అడ్డుకుంటుందని భావించలేం. ఆర్బీఐ పర్యవేక్షణ ఉండి కూడా బ్యాంకు మోసాలు ఎందుకు జరుగుతున్నాయి..? బ్యాంకు కుంభకోణాల వెనుకున్న కుట్రదారుల్ని పట్టుకునే యం త్రాంగం, విధానాలు కీల కమని వారు అంటున్నారు.
కమ్మేస్తున్న సంక్షోభం..
సహకార బ్యాంకు అయినా, వాణిజ్య బ్యాంకు అయినా.. దేంట్లోనూ ఖాతాదార్ల సొమ్ముకు నేడు భరోసా లేకుండా పోయింది. ఆర్థిక మోసాల కారణంగా 2013-18 మధ్యకాలంలో దేశంలో 127 బ్యాంకులు మూతపడ్డాయి. ఇందులో అత్యధిక బ్యాంకులు...తమ ఖాతాదార్లకు చెల్లింపుల్లో విఫలమయ్యాయి. 'డిపాజిట్ ఇన్సూరెన్స్' పథకం కింద 4లక్షల ఖాతా దార్లకు సొమ్ములు చెల్లించాల్సి వచ్చింది. సహకార బ్యాంకుల కార్యకలాపాలన్నీ గ్రామీణ ప్రాంతాలతో ముడిపడి ఉన్నాయి. ఆ బ్యాంకులు సంక్షోభంలో కూరుకు పోతే, గ్రామాల్లో ఉండే పేదలు, రైతుల ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. పంజాబ్, మహారాష్ట్ర సహకార బ్యాంకు, యస్ బ్యాంకు కుంభకోణా లు, వాటి ఖాతాదార్ల అనుభవాలు ఎంతోమందిని భయపెడుతున్నాయి.
పెత్తనమంతా ఆర్బీఐ చేతుల్లో..: సహకార బ్యాంకులపై జూన్ 27న మోడీ సర్కార్ ఆర్డినెన్స్ జారీచేసింది. సహకార బ్యాంకుల పాలన, పర్యవేక్షణ అంతా ఇప్పటివరకూ రాష్ట్రాల పరిధిలో ఉండగా, దానిని తొలగించి...ఆర్బీఐకి అప్పజెప్పారు. తద్వారా జరిగిన ముఖ్యమైన మార్పు, సంక్షోభంలో చిక్కుకున్న సహకార బ్యాంకును ఆర్బీఐ తన ఆధీనంలోకి తీసుకొని వేరే బ్యాంకులతో విలీనం చేస్తుంది. స్టేట్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్స్...అధికారం చెల్లదు.