Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా వైరస్ వల్ల ఆరోగ్య రంగంలో చోటు చేసుకున్న పరిణామాల వల్ల దేశవ్యాప్తంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. గడిచిన 100 సంవత్సరాల్లో ఎన్నడూ లేని సంక్షోభ పరిస్థితులను చూస్తున్నామన్నారు. ఎస్బీఐ ఏర్పాటు చేసిన 'బ్యాంకింగ్ అండ్ ఎకనామిక్స్ కాంక్లేవ్'లో దాస్ వీడియోకాల్లో మాట్లాడుతూ దేశంలో ఉపాధి, ఇతర రంగాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆర్బీఐ అన్ని రకాల చర్యలు తీసుకుందన్నారు. వృద్ధి రేటుతో పాటు ఆర్థిక స్థిరత్వంపై దృష్టి సారించిందన్నారు. ఇప్పటివరకు తీసుకున్న విధానపరమైన చర్యలు పని చేశాయన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టత, తిరిగి కోలుకోగలిగే శక్తికి కరోనా సంక్షోభం పరీక్షగా నిలిచిందన్నారు. గత ఫిబ్రవరి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు వడ్డీ రేట్లను 250 బేసిస్ పాయింట్లు తగ్గించినట్టు గుర్తు చేశారు. మార్కెట్లో విశ్వాసం నింపేందుకు ద్రవ్య లభ్యత పెంచే దిశగా అనేక నిర్ణయాలు తీసుకున్నామన్నారు.
యస్ బ్యాంక్ కుంభకోణంలో ఆర్బీఐ స్పందించిన తీరు.. ఆర్థిక స్థిరత్వాన్ని సాధించే దిశగా తీసుకున్న చర్యలకు నిదర్శనమన్నారు. కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బనిందన్నారు. క్లిష్ల పరిస్థితులను ఎదుర్కోవడంలో భారత కంపెనీలు మెరుగ్గా స్పందించాయన్నారు. లాక్డౌన్ సడలింపుల తర్వాత తిరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందనడానికి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. వైరస్ సంక్షోభం వల్ల మూలధన వ్యయంలో కోతలు తప్పవని, నిర్థక ఆస్తులు సైతం పెరిగే అవకాశం ఉందని శక్తికాంత దాస్ అంచనా వేశారు.