Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఒక్కరోజే కొత్తగా 27,114 కరోనా కేసులు.. 519 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) కారణంగా యావత్ భారతావని అతలాకుతలం అవుతున్నది. రోజురోజుకూ వైరస్ వ్యాప్తి అధికమవుతూ.. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో మొదటి లక్ష కరోనా కేసులు నమోదుకావడానికి 110 రోజులు పట్టగా.. కేవలం 56 రోజుల్లోనే అది 8 లక్షలు దాటడం వైరస్ మహమ్మారి వ్యాప్తికి అద్దం పడుతున్నది. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన కోవిడ్-19 వివరాల ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 27,114 కొత్త కేసులు నమోదయ్యాయి. అంటే సగటున గంటకు 1,131 మంది వైరస్ బారినపడినట్టు తెలుస్తున్నది. అయితే, కరోనా వెలుగు చూసినప్పటి నుంచి ఒకే రోజు 27 వేలకు పైగా కొత్త కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. ఇదే సమయంలో 519 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా బాధితుల మరణాల సంఖ్య 22,123కు పెరిగింది. మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 8,20,916కు చేరింది. ప్రస్తుతం 2,83,407 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే, వైరస్ బాధితుల పెరుగుదలతో పాటు రికవరీల సంఖ్య సైతం క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటివరకూ కరోనాతో కోలుకున్న వారి సంఖ్య ఐదు లక్షలు దాటింది. 5,15,386 మంది కోవిడ్-19 నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ప్రధాని మోడీ సమీక్ష
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తాజాగా నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోడీ సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర హౌం మంత్రి అమిత్షా, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్లతో పాటు పలువురు ఇతర మంత్రులు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు, వివిధ రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపైనా చర్చించారు.
కరోనా చికిత్సకు మరో ఔషధం
కరోనా చికిత్సలో వినియోగించుకునేందుకు మరో ఔషధానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. సొరియాసిస్ను నయం చేయడానికి వినియోగించే ''ఇటోలిజుమాబ్'' ఇంజక్షన్ను కరోనా రోగులకు వాడేందుకు అంగీకరించింది. అయితే, ఇది తీవ్రస్థాయిలో కోవిడ్-19 లక్షణాలతో బాధపడుతున్న వారికి అత్యవసర సమయాల్లో మాత్రమే వాడాలని పేర్కొంది.