Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 2 వేల కోట్ల ప్లాన్.. ఎస్జిఒ ఎఫ్ఐఆర్
జైపూర్ : రాజస్తాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ విమర్శించారు. ఆపరేషన్ కమల్ పేరిట తమ ఎమ్మెల్యేల కొనుగోలు చేసేందుకు యత్నిస్తుందని అన్నారు. జైపూర్లో మీడియాతో మాట్లాడుతూ' రాష్ట్రంలో, దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఇప్పుడు చర్చించాల నుకుంటున్నా. కరోనాపై పోరాటం చేసేందుకు అందర్నీ కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా. కానీ బిజెపి ప్రభుత్వం మానవత్వాన్ని మర్చిపోయి... కరోనా విజృంభిస్తున్న సమయంలోనే మా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తోంది. వీరు సిగ్గులేని వ్యక్తులు..వారి సిగ్గులేనితనానికి కూడా ఓ పరిమితి ఉండాలి. గుజరాత్లో ఏడుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి..రెండు రాజ్యసభ స్థానాలు సంపాదించింది. రాజస్తాన్లో కూడా అదే ప్రయత్నం చేయగా..ఇక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యేల సహకారంతో దాన్ని తిప్పికొట్టి..రెండు స్థానాలను సంపాదించాం. అయినప్పటికీ ఆ సిగ్గులేని వాళ్లు..అదే కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు' అని గెహ్లోట్ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై గెహ్లోట్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్లు పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇవ్వనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి కూలదోసేందుకు యత్నించిన ఇద్దరు బిజెపి నేతలను రాజస్తాన్ పోలీసులకు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఒజి) అదుపులోకి తీసుకుంది. వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి, మరొక ప్రభుత్వాన్ని నిలబెడితే 1,000- 2 వేల కోట్లు ఆర్జించవచ్చునని వీరి సంభాషణల్లో ఉన్నట్లు ఎస్ఒజి ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ప్రభుత్వాన్ని పడగొట్టాక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల పదవులు కూడా బిజెపి అధిష్టానం నిర్ణయిస్తుందని చర్చించుకున్నట్లు తెలిపింది. అశోక్ గెహ్లోట్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని 24 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. తమకు గాలం వేసేందుకు ప్రయత్నించిందని, ఈ కుట్రలో బిజెపికి అగ్ర నాయకత్వం ఉందని సంయుక్త ప్రకటన విడుదల చేశారు.