Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సాయం సకాలంలో అందితేనే అన్నదాతకు ప్రయోజనం
- కోవిడ్తో మారిన పరిస్థితులు
- ఈ వైపుగా కేంద్రం చర్యలు చేపట్టేనా?
న్యూఢిల్లీ : దేశంలో ప్రమాదకర కరోనా మహమ్మారిని అరికట్టేందుకు విధించిన లాక్డౌన్.. దేశంలో ఆర్థిక కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. ఈ సంక్షోభ సమయాల్లో, ఆర్థిక వ్యవస్థలో చాలా రంగాలు తిరోగమనంలో ఉన్నప్పుడు... వ్యవసాయ రంగం మాత్రం ఒక కొత్త ఆశను చిగురింపజేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు బాసటగా ఉంటుందనే ఒక ఆశాకిరణంగా నిలిచింది. కరోనా వైరస్ ప్రేరిత మాంద్యం నుంచి తక్కువ ప్రభావితమైన రంగంగా ఇది నిలిచింది. అయితే కోవిడ్ తర్వాత ఆర్థిక పునరుద్ధరణకు ఈ రంగంలో చేపట్టాల్సిన చర్యలు కీలకంగా మారనున్నాయి. రైతులకు అందించే రుణాలు, ఉద్దీపణ ప్యాకేజీ నిర్ణయాల అమలు ఇందుకు కీలకంగా మారనున్నాయి. ఇవి సక్రమంగా అమలయ్యి, సాయం సకాలంలో లబ్దిదారుడి వద్దకు చేరితేనే దేశంలోని ప్రతి అన్నదాతా ప్రయోజనాన్ని పొందగలడు. ఫలితంగా ఈ రంగం అభివృద్ధి పథంలో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది.
విత్తనాలు విత్తే సమయంలో సమయానుకూలంగా, మంచి నాణ్యమైన ఇన్పుట్లను పొందడానికి రుణ లభ్యత చాలా కీలకమనీ, పంట కోత నిర్వహణను గణనీయంగా మార్చగలదని విస్తృతంగా గుర్తించబడింది. బీహార్, జార్ఖండ్, తూర్పు యూపీ, ఒడిషా, పశ్చిమ బెంగాల్లో 2018-19లో దాదాపు మూడువేల వ్యవసాయ గృహాలపై జరిపిన క్షేత్రస్థాయి సర్వే ఆధారంగా అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ(ఐఏఎఫ్పీఆర్ఐ), అధికారిక, అనధికారిక రుణాల ప్రభావాన్ని విశ్లేషించింది.
కేంద్రం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ రెండో దశ చిన్న రైతులకు రుణ మద్దతు విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్(నాబార్డ్), కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ) సౌకర్యం ద్వారా చిన్న రైతులకు అదనపు రుణ సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. కేంద్రం ప్రకటనల ప్రకారం.. చిన్న, ఉపాంత రైతులకు ప్రధాన రుణ వనరులుగా ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్ఆర్బీ), గ్రామీణ సహకార బ్యాంకులు(ఆర్సీబీ) పంట రుణ అవసరాలకు నాబార్డ్ రూ. 30వేల కోట్ల అదనపు రీఫైనాన్స్ మద్దతును అందిస్తుంది. అలాగే 2020-21 ఆర్థిక సంవత్సరంలో సాధారణ రీఫైనాన్స్ మార్గం ద్వారా నాబార్డు అందించే రుణం రూ.90 వేల కోట్ల పైనే.
క్రెడిట్, రీఫైనాన్స్ మద్దతు రైతులకు అత్యవసర వర్కింగ్ క్యాపిటల్ నిధులను సమకూర్చడం, 2019 రబీ సీజన్లో పంటకోత అవసరాలను తీర్చడంలో సహాయపడటం, ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ఖర్చులను జాగ్రత్తగా చూసుకోవడం వంటి కార్యక్రమాల ద్వారా మూడు కోట్ల మందికి పైగా రైతులకు లబ్ది కల్పించాలని భావిస్తున్నారు. దాదాపు 25 లక్షల కొత్త కేసీసీలకు రూ.25 వేల రుణ పరిమితితో మంజూరు చేశారు. మత్స్యకారులు, పశుసంవర్థక రైతులతో సహా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం-కిసాన్) పథకం లబ్దిదారులకు క్రెడిట్ కార్డుల ద్వారా తక్కువ వడ్డీకి రాయితీ అందించడానికి ప్రత్యేక డ్రైవ్ జరుగుతోంది. దీంతో దాదాపు 2.5 కోట్ల మంది రైతులు కవర్ చేయబడతారు. దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల రుణ సహాయాన్ని పొందుతారు.
మార్చి 1 నుంచి వడ్డీ రుణాలపై వడ్డీ ఉపసంహరణ, సత్వర తిరిగి చెలించే ప్రోత్సాహాన్ని మే 31 వరకు పొడిగించారు. వ్యవసాయరంగంలో 86,600 కోట్ల రూపా యల విలువైన 63 లక్షల రుణాలను ప్రభుత్వం ఆమోదిం చగా.. రూ.29,500 కోట్ల రీఫైనాన్సింగ్ను నాబార్డ్.. ఆర్ఆర్బీ, ఆర్ఆర్సీలకు మార్చి, ఏప్రిల్ నెలల్లో అందిం చింది. ఇదిలా ఉండగా, రూ.4.22 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు కలిగిన సుమారు మూడు కోట్ల మంది రైతులు మూడు నెలల మారటోరియం ప్రయోజనాన్ని పొందారు.
వ్యవసాయ క్రెడిట్ ఉద్దీపన ప్యాకేజీ సకాలంలో ఉంటుంది. భారతీయ రైతులు ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన అవరోధాలలో తగినంత రుణ సదుపాయాలు లేకపోవడం. కోవిడ్-19 సంక్షోభం కారణంగా కార్మిక కొరత, పని మూలధనం ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున.. 2020లో ఖరీఫ్ సీజన్కు ప్రభుత్వం అందించిన రుణ మద్దతు కీలకం. ఈ కాలంలో, వడ్డీ రేటు తగ్గింపు, కేసీసీల ద్వారా క్రెడిట్ పొడిగింపు వంటి చర్యలు రైతులకు ఉపశమనాన్ని కలిగించొచ్చు.
ఐఎఫ్పీఆర్ఐ నిర్వహించిన అధ్యయనంలో బీహార్, జార్ఖండ్, తూర్పు యూపీ, ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో సగటున 19శాతం వ్యవసాయ కుటుంబాల్లో మాత్రమే కేసీసీలు ఉన్నాయని తేలింది. కాగా, కేంద్రం తన హామీలను అమలు చేయగలిగితే, ఆహార సౌకర్యాల ప్రయోజనాలు కాలానుగుణంగా రైతులకు చేరితే ఆహార ధరల ద్రవ్యోల్బణానికి కారణమయ్యే ఆహార సరఫరా అంతరాయాల ప్రభావం తక్కువగా ఉంటుంది. సంస్థాగత రుణ వనరులతో ప్రస్తుత సంక్షోభ సమయంలో మెరుగైన సౌలభ్యం పొందడం ద్వారా వచ్చే లాభాలు.. వ్యవసాయ ప్రయోజనాలు, రైతుల సంక్షేమానికి సంబంధించి దీర్ఘకాలిక లాభాలను కలిగి ఉంటాయి. అయితే మోడీ సర్కారు రైతు ప్రయోజనాల కంటే కార్పొరేటు, బడాపారిశ్రామిక వేత్తల ప్రయోజనాలే ముఖ్యమనీ, అన్నదాత గురించి ఆలోచించి వారి బాధలు తీర్చ ఆలోచన ప్రస్తుత కేంద్ర సర్కారు ఉన్నట్టు కనిపించడం లేదని రైతు సంఘాల నాయకులు అంటున్నారు.