Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో డిమాండ్
న్యూఢిల్లీ : సిలబస్ తగ్గింపుపై సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. మన రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలను అణగదొక్కే ప్రయత్నాలు దేశ ప్రజలకు ఎంతమాత్రమూ సమ్మతి కాదని స్పష్టం చేసింది. 10-12 తరగతులకు సంబంధించి కీలకమైన పౌరసత్వం, జాతీయవాదం, సమాఖ్యవాదంతో పాటు మన రాజ్యాంగ నిర్మాణ క్రమానికి ప్రాథమికంగా ఉన్న అంశాలను సిలబస్ నుంచి తగ్గిస్తూ సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణయం సరికాదని పొలిట్బ్యూరో తన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత కరోనా మహమ్మారి, లాక్డౌన్ ఆంక్షలను సాకుగా చూపిస్తూ, విద్యార్థులకు సిలబస్ను తగ్గిస్తున్నామన్న పేరుతో సీబీఎస్ఈ ఈ విధమైన ఏకపక్ష నిర్ణయం తీసుకుందని పార్టీ విమర్శించింది. రాజ్యాంగ విలువలను బలహీనపరిచేలా తీసుకొస్తున్న ఈ సిలబస్ తొలగింపును పొలిట్బ్యూరో తీవ్రంగా వ్యతిరేకించింది. ఇటువంటి చర్యలు లౌకిక, ప్రజాస్వామ్య భారతదేశ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉన్నదని అభిప్రాయపడింది. కీలకమైన పాఠ్యాంశాలను మినహాయించడంలో సీబీఎస్ఈ హేతుబద్ధత చూపలేక పోయిందనీ, మొత్తంగా ఈ సిలబస్ తగ్గింపు నిర్ణయం అనుమానాస్పదంగా ఉందని పేర్కొంది.
ఆన్లైన్ పరీక్షలను తిరస్కరించండి : సీపీఐ(ఎం)
ఈనెల 6న విడుదల చేసిన ఒక సర్కులర్ ద్వారా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) చేసిన ఏకపక్ష ప్రతిపాదనను సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శనివారం నాడిక్కడ ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్, లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో విద్యార్థులు భౌతికంగా హాజరై పరీక్షలు రాసేందుకు వీలులేని ప్రాంతాల్లో ఆన్లైన్ లేదా ఓపెన్ బుక్ పరీక్షల వంటి జాతీయ నమూనాను యూజీసీ ప్రతిపాదిస్తోంది. అయితే దేశంలో ఇంటర్నెట్ కనెక్టవిటీ ఇప్పటికీ 36 శాతం మాత్రమే ఉందని, ఇటువంటి సమయంలో దేశంలోని మెజార్టీ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులకు హాజరవడం లేదా పరీక్షలు రాయడం సాధ్యం కాదని పొలిట్బ్యూరో పేర్కొంది. ప్రధానంగా దేశంలో డిజిటల్ కనెక్టివిటీ సదుపాయం లేని ప్రాంతాల్లో నివసిస్తున్న బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందనీ, అదేవిధంగా భారీగా నష్టపోవాల్సి వస్తుందని తెలిపింది. ఈ నేపథ్యంలో యూజీసీ ప్రతిపాదన పూర్తిగా వివక్షతో కూడుకున్నదని విమర్శించింది. ఇటువంటి నిర్ణయం ఎంతమాత్రం ఆమోదనీయం కాదని స్పష్టం చేసింది.
విద్య అనేది మన దేశ రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉంది. గనుక రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండా యూజీసీ ఏకపక్షంగా ఇలా ఆదేశించజాలదని పొలిట్బ్యూరో పేర్కొంది. రాష్ట్ర యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలలు విద్యా బోధన, పరీక్షల నిర్వహణలో వివిధ రకాల నమూనాలను అనుసరిస్తున్నాయని పేర్కొంది. అలాగే ఈ ఆన్లైన్ వ్యవస్థ వలన భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉన్న ఉపాధ్యాయులు, మరీ ముఖ్యంగా విద్యార్థుల ప్రతినిధులతో కూడా సంప్రదించాలని చెప్పింది. అనేక యూనివర్సిటీలకు సూదూర ప్రాంతాల్లో అనుబంధ కళాశాలలు ఉన్నాయి. పెరుగుతున్న కరోనా కేసులు, లాక్డౌన్ ఆంక్షల కారణంగా ఆయా విద్యార్థులు ఇంటర్నెట్ సదుపాయం పొందే అవకాశం ఉండదనీ, తద్వారా ఆన్లైన్ విద్య, పరీక్షలకు హాజరు కాలేరని పేర్కొంది. మన విద్యావ్యవస్థలో ఈ విధమైన డిజిటల్ విభజన ఆమోదనీయం కాదని పొలిట్బ్యూరో అభిప్రాయపడింది. ఏదేమైనా గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ ఆఖరి సంవత్సరం విద్యార్థులకు వారి డిగ్రీలను ప్రదానం చేయాల్సిన అవసరం ఉందని, తద్వారా వారు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇందుకుగానూ విద్యార్థి అంతకుమునుపటి సెమిస్టర్ పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగానే డిగ్రీలు ఇవ్వాలని సూచించింది. అధికారులు అనుసరిస్తున్న వైఖరి, అనిశ్చిత పరిస్థితుల కారణంగా విద్యార్థులు ఇప్పటికే మానసికంగా తీవ్ర వేదనకు గురయ్యారనీ, ఇప్పుడు ఆన్లైన్ పరీక్షలు అనే అంశం వారిని మరింత బాధపెడుతుందని తెలిపింది. ఆన్లైన్ క్లాసులకు హాజరుకాలేని విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఇప్పటికే ఉన్నాయని హెచ్చరించింది. ఇటువంటి పరిస్థితుల దృష్ట్యా మునుపటి సెమిస్టర్లో ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు వారి డిగ్రీలు ప్రదానం చేయాలని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో డిమాండ్ చేసింది.