Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-పెరిగిన లింగవివక్ష
- ఆరోగ్యంపై నిస్సహాయత...ఉపాధి, భద్రత డొల్లే : ఐక్యరాజ్య సమితి తాజా అధ్యయనం
న్యూఢిల్లీ : లాక్డౌన్ మహిళల్ని అగాధంలోకి నెట్టేసింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్ భారతదేశాన్ని వెనక్కి నెట్టేసింది. మానవసంబంధాలు, మానవ వనరులు కూడా మృగ్యమయ్యాయి. ముఖ్యంగా దేశంలో మహిళల పట్ల లాక్డౌన్ కాలంలో లింగవివక్ష తీవ్రంగా పెరిగినట్టు ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) తాజా అధ్యయనం వెల్లడించింది. అలాగే ఉపాధిరంగంలోనూ మహిళలే నష్టపోయారని ఆ అధ్యయనం పేర్కొన్నది. పురుషాధిక్య సమాజంలో మహిళల భద్రత కూడా సవాలుగానే మారింది. భారతదేశంతో పాటు పలు దేశాల్లో ఐక్యరాజ్యసమితి ఈ అధ్యయనాన్ని చేసింది. ఆర్థికరంగంలో మహిళల శక్తి సామర్థ్యాలను లాక్డౌన్ చిన్నబుచ్చినట్టు తేలింది. ఆర్థికం, ఆరోగ్యం, వ్యాపారం, వాణిజ్యం, విద్య.. ఇలా అనేక అంశాలకుపై యూఎన్ఎఫ్పీఏ అధ్యయనం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
ఐక్యరాజ్య సమితి అధ్యయనం ప్రకారం.. లాక్డౌన్ మరో ఆరు నెలలు కొనసాగితే.. తక్కువ, మధ్య-ఆదాయ దేశాల్లో4.70 కోట్ల మంది మహిళలు ఆధునిక గర్భనిరోధక మందులను పొందలేకపోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. అలాగే 70 లక్షల అనాలోచిత గర్భాలకూ దారితీయోచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. రాబోయే రోజుల్లో లింగ ఆధారిత (జెండర్ బేస్డ్) హింస కేసులు పెరిగే అవకాశం ఉన్నదని తెలిపింది. జనాభా పెరుగుదలతో పెరుగుతున్న సమస్యలు, కుటుంబ నియంత్రణ, జననాల అదుపుదల వంటి అంశాల పట్ల ప్రచారాన్ని, అవగాహనను కల్పించాల్సిన ఆవశ్యకతనూ గుర్తించింది. అదే ఉద్దేశంతో జులై 11ను ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభా దినోత్సవంగా పాటిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జనాభా 500 కోట్ల మార్కును దాటిందని యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(యూఎన్డీపీ) గుర్తించిన అనంతరం 1989లో తొలిసారిగా దీనిని పాటించారు.
ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగదల ఆందోళన కలిగిస్తున్నదని యూఎన్డీపీ పేర్కొన్నది. ప్రస్తుతం దాదాపు 780 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా... 2030 నాటికి 850కోట్లకు చేరుకుంటుందని హెచ్చరించింది. కోవిడ్ విజృంభిస్తున్న వేళ.. మహిళల గురించి ఆందోళన కలిగించే విషయాలను వెల్లడించింది. ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవం వేదికగా మహిళలకు లైంగిక, పునరుత్పుత్తికి సంబంధించిన అంశాలపై, వారి హక్కులు, ముఖ్యంగా కరోనా కాలంలో అవగాహన కల్పించాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది.
ఈ హక్కులు విద్య, అవగాహన, శారీరక భద్రత, మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రంతో విడదీయరానివిగా ఉండాలని ఆకాంక్షించింది. ఇవన్నీ భారతదేశంలో తీవ్రంగా ప్రభావితమయ్యాయనీ, ముఖ్యంగా లింగ అసమానత దారుణంగా ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది.
స్త్రీలు, దళితులకు బాధలు
అశోక విశ్వవిద్యాలయం ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ అశ్వినీ దేశ్పాండే పేర్కొన్న సమాచారం ప్రకారం.. లాక్డౌన్ తొలి దశలో ఉద్యోగ, ఉపాధి నష్టాలలో లింగ, కుల అసమానతలను వెల్లడించారు. స్త్రీలు.. పురుషుల కంటే చాలా ఎక్కువ బాధలు అనుభవించారు. గ్రామీణ మహిళలు.. పట్టణ మహిళల కంటే, పెత్తందారీ కులాల కంటే దళితులు ఎక్కువగా బాధపడ్డారు. లాక్డౌన్ తర్వాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోయిన మహిళల సంఖ్య పురుషులతో పోల్చుకుంటే అధికంగా ఉన్నది. లాక్డౌన్ ప్రభావాలు ముఖ్యంగా పేద గృహాల్లోన్ని మహిళలకు ప్రతి అంశంలోనూ ప్రతికూలంగా మారాయని మాంచెస్టర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బినా అగర్వాల్ తెలిపారు.
అలాగే ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల విషయంలోనూ లింగే వివక్ష కనిపించింది. భారత్లో దాదాపు 80శాతం మంది నర్సులు, మంత్రసానులు, ఆశా కార్మికులు స్త్రీలు కాగా.. 80శాతాని కంటే ఎక్కువ మంది వైద్యులుగా పురుషులే ఉన్నారు. ప్రమాదకర కరోనా సమయంలో పీపీఈల పంపిణీలో నర్సుల కంటే వైద్యులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్టు పలు నివేదికలు పేర్కొన్నాయి. దేశంలో విధించిన లాక్డౌన్.. లింగ అంతరాన్ని తీవ్రంగా పెంచిందని సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ రంజనా కుమారీ అన్నారు. మహిళల హక్కులపై సమగ్ర విధానం, రాజకీయ సంకల్పం అవసరమని ఆమె తెలిపారు. లాక్డౌన్ అనంతర పరిస్థితులపై సమర్థవంతమైన చర్చలు జరగాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు.