Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పేదలు,అణగారిన ప్రజల్ని ఆదుకోవాలి: ఐఎంఎఫ్
న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రభావం, ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలమైన వర్గాలను ఆదుకోవాల్సిన అవసరమున్నదనీ, ఆర్థిక వ్యవస్థలో అందుకు అవకాశం కూడా ఉన్నదని ఐఎంఎఫ్ ఉన్నతాధికారి విటోర్ గాస్పర్ అన్నారు. ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాల ప్రజలకు సబ్సిడీలు కొనసాగించాలని, చిన్నమధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం ద్రవ్య మద్దతు అందజేయాలని ఆయన చెప్పారు. రేషన్ సరుకుల పంపిణీ, నగదు సాయం...వంటివి పూర్తిస్థాయిలో అమలుజేయాల్సిన అవసరముందని అన్నారు. ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ సబ్సిడీలు మరింత సమర్థవంతంగా, నమ్మకమైన మార్గాల్లో అమలుజేయాలని చెప్పారు. భారతదేశంలో కోవిడ్-19 ప్రభావం, అది సృష్టించిన ఆర్థిక కల్లోలం భారీగా ఉందన్నారు. కీలకమైన సూచికలన్నీ ఆర్థిక వ్యవస్థ పతనాన్ని సూచిస్తున్నాయనీ, పారిశ్రామిక ఉత్పత్తి, వర్తక వాణిజ్యం, వాహనాల అమ్మకాల్లో స్పష్టంగా కనపడుతున్నదని చెప్పారు. 2020-21లో భారత్ జీడీపీ వృద్ధిరేటు మైనస్ 4.5శాతానికి పడిపోతున్నదని 'వరల్డ్ ఎకానమిక్ అవుట్లెక్' ఇప్పటికే అంచనావేసిందన్నారు. ఏప్రిల్తో పోల్చితే, ఇప్పుడు దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయని చెప్పారు.
వేగంగా కోలుకోవాలి
పాక్షిక లాక్డౌన్ ఎంతోకొంత మేరకు అమలుజేయాల్సి వస్తుందని ఐఎంఎఫ్ అభిప్రాయపడుతున్నది. భారత్లాంటి దేశాలు ఆరోగ్య సంక్షోభం నుంచి వీలైనంత త్వరగా, వేగంగా కోలుకోవాలి. అంతర్జాతీయంగా, దేశీయంగా కొనసాగే మందకొడి భారత ఆర్థిక వ్యవస్థపై కచ్చితంగా ప్రభావముంటుంది. కోవిడ్ నేపథ్యంలో ఉండే అనిశ్చితి వృద్ధిరేటును నిర్ణయిస్తాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్లో ద్రవ్యలోటు 12.1శాతానికి (వార్షిక జీడీపీలో) చేరుకుంటుందని అంచనాలున్నాయి. పన్ను ఆదాయాలు దారుణంగా పడిపోతున్నాయి. జీడీపీలో పభుత్వం అప్పులు 84శాతానికి చేరుకోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య కోటీ 30లక్షలు దాటిందని 'జాన్ హాప్కిన్స్ రిసోర్స్ సెంటర్' ఒక నివేదిక విడుదలచేసింది. దీని ప్రకారం, మరణాల సంఖ్య 5.71లక్షలు దాటింది. అత్యధిక కేసులు అమెరికాలో నమోదయ్యాయి. ఇక్కడ 34.13లక్షల మందికి కరోనా సోకింది. 1.37లక్షలమంది మరణించారు. వివిధ దేశాల్లో కరోనా వ్యాక్సిన్పై పరిశోధనలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి.