Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా సమయంలో తబ్లీగి జమాత్ కార్యాక్రమాల్లో పాల్గొన్నారనే ఆరోపణలతో 35 దేశాలకు చెందిన 2,765 మంది విదేశీయులను కేంద్రం బ్లాక్లిస్టులో పెట్టడంపై ఈ నెల 24న విచారణ చేస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. 10 సంవత్సరాల పాటు భారత్లో ప్రయాణించకుండా తమను బ్లాక్లిస్టులో పెట్టడంపై కొంతమంది విదేశీయులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సోమవారం ఈ కేసును జస్టిస్ ఎఎం. ఖన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విచారణ చేసింది. విచారణను రెండు వారాల పాటు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్త్తి చేశారు. దీంతో స్పందించిన ధర్మాసనం కేసును వచ్చే శుక్రవారానికి మాత్రమే వాయిదా వేసింది. ఈ నెల 2న జరిగిన విచారణలో విదేశీయుల పిటీషన్లు కొట్టివేయాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. 2,765 మంది విదేశీ పౌరులకు వీసాలు రద్దు చేయడం, బ్లాక్లిస్టు చేయడంపై ప్రతీ ఒక్కరికీ వ్యక్తిగత ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపింది.
ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకూ తబ్లిగీ జామాత్ సభ్యులపై 11 రాష్ట్రాల్లో 205 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. 2,679 మంది విదేశీయుల వీసాలను రద్దు చేశారు. మరో 86 మంది నేపాల్ దేశస్థులు. వీరికి వీసాలు అవసరం లేదు. కాగా, జులై 2న విచారణలో తమ వీసాల రద్దు విషయాన్ని ఈమెయిల్స్ ద్వారానే చూశామని, తమకు ఎలాంటి షోకాజ్ నోటీసు జారీ చేయలేదని తమ లాయర్లు ద్వారా విదేశీయులు కోర్టుకు తెలిపారు.