Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ '' భారత్ అమ్మకానికి కాదు..' అన్న నినాదంతో ఆగస్టు 9న దేశవ్యాపిత ఆందోళన నిర్వహించనున్నట్టు భూమి అధికార్ ఆందోళన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆదివారం జరిగిన జాతీయస్థాయి ఆన్లైన్ సమావేశంలో తీర్మానం చేశారు. దీంతో పాటుగా మరో ఎనిమిది తీర్మానాలకు సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈనెల 23న బ్లాక్ లేదా తహశీల్ స్థాయిలో ఆందోళనలు చేయనున్నట్టు తెలిపింది. ఆ సమయంలో జాతీయ అంశాలతో పాటు స్థానిక అంశాలను కూడా లేవనెత్తనున్నట్టు పేర్కొంది. జాతీయ స్థాయి ఆన్లైన్ సమావేశానికి ప్రజా ఉద్యమ సంఘాలకు చెందిన 150 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరిలో ఏఐకేఎస్కు చెందిన హన్నల్ మోల్లా, ఎన్ఏపీఎంకు చెందిన మేథా పాట్కర్, కిసాన్ సంఘర్ష్కు చెందిన డాక్టర్ సునీలం తదితరులు ఉన్నారు.
అభివృద్ధి పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహజ వనరులను దోపిడీ సరుకుగా మార్చిందనీ, కరోనా వైరస్ సంక్షోభంలో ప్రజారోగ్యం, సామాజిక భద్రతపై దృష్టి పెట్టకుండా, కార్పొరేట్ గ్రూపులకు సహజ వనరులను విచక్షణారహితంగా విక్రయించడంపైనే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని భూమి అధికార్ అందోళన్ విమర్శించింది. సాధారణ శ్రామిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశంలో ప్రతినిధులు పంచుకున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షోభ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో దీనస్థితిలో ఉన్న సామాన్య ప్రజల పరిస్థితిపై ఈ సమావేశం దృష్టి సారించింది. ఇదే సమయంలో సామాజిక ఉద్యమవేత్తలు, ప్రగతీశీల సంఘాలపై దాడులను ఖండించింది. బీజేపీ ప్రభుత్వ పాలన సామాన్య ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమనీ, వారి గురించి పట్టించుకోదని స్పష్టమైయిందని సమావేశం తెలిపింది.
మహమ్మారి నేపధ్యంలో ప్రజలు కలిసికట్టుగా తమ వ్యతిరేకతను వ్యక్తం చేయలేకపోతున్న సమయంలో సహజ వనరుల నిర్వహణ, నియంత్రణలో బీజేపీ ప్రభుత్వం వివిధ సవరణలు, ఉత్తర్వులు జారీ చేస్తోందని విమర్శించింది. సమావేశం నాలుగు సెషన్లలో.. కార్మిక చట్టాల్లో సవరణలు, వలస కార్మికుల జీవితాలు, వారి జీవనోపాధిపై ఎదుర్కొంటున్న సవాళ్లు, బొగ్గు గనుల వాణిజ్యీకరణ, వ్యవసాయంపై ప్రతికూల ప్రభావాలు, ఈఐఏ నోటిఫికేషన్ 2020 ప్రవేశపెట్టడం ద్వారా పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలను నిర్లక్ష్యం చేయడానికి బీజేపీ ప్రభుత్వ ప్రయత్నం.. వంటి అంశాలపై చర్చించారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం నేరంగా పరిగణిస్తున్నారనీ, ప్రజాస్వామిక ఉద్యమాలను నిర్మించడంపై దృష్టి పెట్టాలని సమావేశంలో ప్రతినిధులు సూచించారు. ప్రజావ్యతిరేక చట్టాలు విధించడానికి, జాతీయ వనరులను ప్రయివేటు వ్యక్తులకు దోచిపెట్టడానికి వైరస్ మహమ్మారిని ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు వ్యతిరేకించడానికి, ప్రజాస్వామ్య ఉద్యమాలను నిర్మించడానికి వ్యూహాలను రూపొందిం చడానికి సమావేశం తీర్మానాలను ఆమోదించారు. ఇందులో జులై 23, ఆగస్టు 9 ఆందోళనలతో పాటు అంశాలు ఉన్నాయి. భూసంస్కరణలు కోరుతూ ఒక ప్రచార కార్యక్రమం ప్రారంభిస్తామనీ, దీన్ని భవిష్యత్లో ప్రజాఉద్యమంగా రూపాంతరం చెందించాలని నిర్ణయం తీసుకున్నారు. సహజ వనరుల వినియోగానికి రాయల్టీ డిమాండ్ చేసేలా ప్రజలను సమీకరించాలని, సామాజిక ఉద్యమాలకు వీకేంద్రీకరణ కీలకమని, సహజ వనరుల దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో బలహీనవర్గాల ప్రజలకు చోటు కల్పించడం, కార్మిక చట్టాల్లో కేంద్రం తీసుకువస్తున్న మార్పులను వ్యతిరేకించేందుకు ప్రజా ఉద్యమ సంఘాలు కలిసి రావాలనీ, వలస కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనీ, 73వ రాజ్యాంగ సవరణను సమర్ధవంతంగా అమలు కోరుతూ సంబంధిత తీర్మానాలను ఆమోదించారు.