Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఒకే రోజు రికార్డు స్థాయిలో 28,701 కేసులు..
500 మరణాలు
- అధిక కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో రెండో స్థానం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రభావం పెరుగుతూనే ఉంది. రోజువారీగా రికార్డు స్థాయిలో కొత్తగా కరోనా బారినపడుతున్న వారితో పాటు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య సైతం పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 500 మంది వైరస్తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కోవిడ్-19 బాధితుల మరణాల సంఖ్య 23,174కు పెరిగింది. అలాగే, గత నాలుగు రోజులుగా దేశంలో రోజువారీగా 26 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండటం కరోనా వ్యాప్తి ఉధృతికి అద్దం పడుతున్నది. తాజాగా ఒక్కరోజునే రికార్డు స్థాయిలో 28,701 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వెలుగు చూసినప్పటి నుంచి దేశంలో ఇంత ఎక్కువ సంఖ్యలో కొత్త కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో మొత్తం వైరస్ సోకినవారి సంఖ్య 8,78,254కు చేరింది. ప్రస్తుతం 3,01,609 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ కోవిడ్-19 నుంచి దేశంలో 5,53,471 మంది కోలుకున్నారు. వైరస్ బాధితుల రికవరీ రేటు ప్రస్తుతం 63.01 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, ఈ నెల 12 నాటికి 1,18,06,256 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారత వైద్య పరిశోదన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజునే 2,19,103 నమునాలను పరీక్షించినట్టు తెలిపింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న అమెరికా తర్వాత భారత్లోనే అధికంగా నమోదవుతున్నాయి. ఈ తర్వాత రష్యా, బ్రెజిల్ దేశాలున్నాయి.
దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, బెంగాల్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు టాప్-10లో ఉన్నాయి. మహారాష్ట్రలో రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల్లో గణనీయంగా పెరుగుదల నమోదవుతున్నది. తాజాగా అక్కడ 6,479 కొత్త కేసులు నమోదుతో పాటు 193 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 2,60,924కు చేరగా, మరణాల సంఖ్య10,482కు పెరిగింది. ఢిల్లీలో ఇప్పటివరకూ 1.10లక్షల కేసులు నిర్ధారణతో పాటు 3,300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్లో కరోనా ప్రభావం పెరుగుతూనే ఉంది. తాజాగా 1,654 కేసులు నమోదయ్యాయి. అలాగే, 21 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 38,130కి పెరగడంతో పాటు మరణాల సంఖ్య 955కు చేరింది. అలాగే, గుజరాత్లో 40069, కర్నాటకలో 33,418 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తమిళనాడులో రవాణా సేవలు బంద్
తమిళనాడులో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకూ ప్రభుత్వ, ప్రయివేటు రవాణా సేవలను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. క్యాబ్లు, ఆటోలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ప్రజలు దీనికి సహకరించాలని తెలిపింది. తాజాగా రాష్ట్రంలో 4,328 కొత్త కేసులు నమోదుతో పాటు 66 మంది మరణించారు. దీంతో కరోనా బాధితుల సంఖ్య 1,42,798 పెరగడంతోపాటు మరణాల సంఖ్య 2,032కు చేరింది. చెన్నై, మధురై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరుచ్చి, తిరువళ్లూరు, తేని, కళ్లకురుచ్చి ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది.
బెంగాల్లో కరోనాతో డిప్యూటీ మేజిస్ట్రేట్ మృతి
బెంగాల్లో ఓ డిప్యూటీ మేజిస్ట్రేట్ కరోనా బారినపడి సోమవారం కన్నుమూశారు. ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు కరోనా మరణించడం రాష్ట్రంలో ఇదే తొలిసారని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. హూగ్లీ జిల్లాకు చెందిన దేవ్దత్తా సెరాంపోర్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. గతవారం ఆమెకు కరోనా సోకగా హౌం ఐసోలేషన్లోకి వెళ్లారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో ఆదివారం ఉదయం ఆస్పత్రిలో చేరగా, పరిస్థితి విషమించడంతో మరణించారు. కాగా, బెంగాల్లో ఇప్పటివరకూ 30,013 మందికి వైరస్ సోకగా వారిలో 932 మంది మరణించారు.
పంజాబ్లో ఆంక్షలు కఠినతరం
పంజాబ్లో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తూనే ఉంది. దీంతో వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను మరింత కఠినతరం చేస్తూ.. దీనికి సంబంధించిన తాజాగా సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. బహిరంగా సమావేశాలను పూర్తిగా రద్దు చేసింది. అలాగే, సామాజిక సమావేశాలకు ఐదుగురికంటే ఎక్కువ మంది పాల్గొనకూడదని స్పష్టం చేసింది. పెండ్లిల్లకు ఇదివరకూ 50కి అనుమతించగా ప్రస్తుతం 30 మందికి పరిమితం చేసింది. పని ప్రదేశాల్లో మీటింగ్ల నిర్వహణ నిషేధంతో పాటు, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, రాష్ట్రంలో తాజాగా 234 పాజిటివ్ కేసులు నమోదుతో పాటు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్త పాజిటివ్ కేసుల సంఖ్య 7821కు చేరగా.. మరణాల సంఖ్య 200కు పెరిగింది.
కేరళలో ప్లాస్మా బ్యాంకు
కరోనా కట్టడిలో దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న కేరళ.. తాజాగా కరోనా రోగులకు మెరుగైన చికిత్సగా భావిస్తున్న ప్లాస్మా చికిత్స కోసం.. రాష్ట్రంలో ప్లాస్మా బ్యాంకును ఏర్పాటు చేసింది. మంజేరీ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలో దీనిని ఏర్పాటు చేసింది. కాగా, వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా సోకుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. తాజాగా 449 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో వైరస్ మరణాల సంఖ్య 77కు పెరగగా.. కోవిడ్-19 బాధితుల సంఖ్య 8,322కు చేరింది.
లాక్డౌన్లో మరణించిన
వలస జీవులకు సోనూసూద్ సాయం
లాక్డౌన్ సమయంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస జీవులను వారి స్వస్థలకు తరలించడానికి ఖర్చుకు వెనకాడకుండా బస్సులు, విమానానాలను ఏర్పాటు చేసిన బాలీవుడ్ నటుడు సోనూసుద్ మానవత్వానికి ప్రతీకగా నిలిచారు. తాజాగా లాక్డౌన్ సమయంలో మరణించిన, గాయపడిన వలస కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని నిశ్చయించాడు. ఆర్ధిక సాయం చేసేందుకు వీలుగా వారి చిరునామాలు, బ్యాంకు అకౌట్ల వివరాలు సేకరిస్తున్నాడు. దీన్ని వ్యక్తిగత బాధ్యతగా భావిస్తున్నట్టు సోనూసూద్ స్పష్టం చేశారు.