Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : జైలులో అనారోగ్యంతో బాధపడుతున్న రచయిత పి. వరవరరావును చికిత్స కోసం జేజే ఆస్పత్రిలో చేర్పించారు. బీమా కొరేగావ్ కేసులో 22 నెలలుగా జైలుల్లో ఉంటున్న 81 ఏండ్ల వరవరరావు ఆరోగ్యం కొంత కాలంగా క్షీణించింది. తలోజ సెంట్రల్ జైలు నుంచి కొన్ని పరీక్షల కోసం సోమవారం ఉదయం ఆస్పత్రికి తరలించారు. 'పెండయల వరవరరావు న్యూరాలజీ విభాగంలో చేరారు. అతన్ని పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది' అని ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. మే నెలలోనూ వరవరావును జేజే ఆస్పత్రిలో చేర్చినప్పటికీ, చికిత్స పూర్తికాకముందే మళ్లీ జైలుకు పంపించారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ఈసారైనా వరవరరావుకు పూర్తి చికిత్స అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వరవరరావు కుమార్తె పావన మీడియాతో మాట్లాడుతూ తన తండ్రిని జైలు నుంచి ఆస్పత్రికి తరలిస్తున్నట్టు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ద్వారా సమాచారం వచ్చిందని చెప్పారు. మే 29న కూడా ఒక రోజు తరువాతే తమకు సమాచారం వచ్చిందని చెప్పారు. జులై 11న కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు వరవరరావు గుర్తుపెట్టుకోలేకపోవడం, స్వయంగా నడిచే శక్తిలేదనీ, సొంతంగా బాత్రూమ్కి వెళ్లడం, బ్రష్ చేసుకోవడం చేసుకోలేరని బీమా కొరేగావ్ కేసులో సహ నిందితుడు వెర్నోన్ గోన్సాల్వెస్ తెలిపారు. మరోవైపు, వరవరరావుకు తాత్కాలిక మెడికల్ బెయిల్ కోసం న్యాయవాది ఆర్ సత్యనారాయణ వేసిన పిటిషన్ను ఈ నెల 17న ముంబయి హైకోర్టు విచారించాల్సి ఉంది.