Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ చొరవతో పెరుగుతున్న రికవరీ రేటు
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
దేశ రాజధాని ఢిల్లీలో మహమ్మారి కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ, కేంద్ర ప్రభుత్వ సంప్రదింపుల కారణంగా కేసుల సంఖ్య అదుపులోకి వస్తున్నాయి. గత నెల చివరి వారంలో రోజుకు సగటున నాలుగు వేలకు చేరువలో కేసులు నమోదు కాగా, ప్రస్తుతం ఆ సంఖ్య 12 వందలకు పడిపోయిందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మీడియాకి తెలిపారు. ఇక, కరోనా బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య సైతం గణనీయంగా పెరిగిందని ఆయన వివరించారు. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ సగటు సుమారు 73 శాతంగా నమోదు కాగా, ఢిల్లీ రికవరీ రేటు 80 శాతానికి పైగా రికార్డు అయినట్లు తెలిపారు. మరోవైపు మంగళవారం ఎన్ ఎన్ జేపి ఆస్పత్రిలో రెండో ప్లాస్మా బ్యాంక్ను సీఎం కేజ్రీవాల్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కరోనా నుంచి కోల్పోకున్న వారు తమ ప్లాస్మాను దానం చేసి, ఇతరుల ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. మరణాల సంఖ్యను తగ్గించడంలో ఆక్సీమీటర్లు 'సురక్ష కవచం'గా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం స్వల్ప లక్షణాలతో ఇంటి వద్ద చికిత్స పొందుతున్న వారికి ఆక్సీ మీటర్లను అందించినట్టు తెలిపారు. రోగి ఆక్సిజన్ స్థాయి 90 కంటే తక్కువకు పడిపోతే, ఈ పరికరం వెంటనే అప్రమత్తం చేస్తుందన్నారు. ఈ దిశలో రోజూవారి టెలి కౌన్సిలింగ్, ఆక్సిమీటర్ల ద్వారా ఇంట్లో చికిత్స పొందుతున్న వారి మరణాల సంఖ్య ను గణనీయంగా తగ్గాయన్నారు. ఢిల్లీలో సుమారు లక్షా 14 వేల మందికి వైరస్ సోకగా, దాదాపు 92 వేల మంది కోలుకున్నారన్నారు.