Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-డిప్యూటీ సీఎంగా తొలగించిన కాంగ్రెస్
- పీసీసీ అధ్యక్ష పదవి నుంచి కూడా..
- ఆయన బీజేపీ చేతుల్లో ఆటవస్తువు : గెహ్లాట్
జైపూర్ : రాజస్థాన్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తాజాగా సీఎం ఆశోక్ గెహ్లాట్పై తిరుగుబాటు జెండా ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, డిప్యూటీ ముఖ్యమంత్రి సచిన్ పైలట్కు పార్టీ అధిష్టానం ఉద్వాసన పలికింది. ఆయన్ను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించడంతో పాటు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పించారు. ఈ మేరకు మంగళవారం జైపూర్లో ఆశోక్ గెహ్లాట్ నేతృత్వంలో జరిగిన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పైలట్తో పాటు మరో ఇద్దరు మంత్రులు విశ్వేంద్ర సింగ్, రమేష్ మీనాలను కూడా క్యాబినెట్ నుంచి తొలగించినట్టు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ప్రకటించారు. సీఎల్పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న గోవింద్ సింగ్ దొస్తారాను అధిష్టానం రాజస్తాన్ కొత్త పీసీసీ అధ్యక్షుడిగా నియమించినట్టు తెలిపారు. పైలట్పై సోనియా, రాహుల్ గాంధీలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారనీ, ఆయనకు చిన్న వయసులోనే రాజకీయ పవర్ ఇచ్చారని అన్నారు. అయినా కూడా ఆయనతో పాటు ఇతర మంత్రులు బీజేపీ కుట్రలో భాగంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కాగా, తన ఉద్వాసనపై సచిన్ పైలట్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ' సత్యాన్ని వక్రీకరించగలరేమోగానీ, ఓడించలేరు' అని హిందీలో పోస్టు చేశారు. ట్విట్టర్ ఖాతాలో కూడా పార్టీపరంగా, ప్రభుత్వ పరంగా ఉన్న పదవులను తొలగించారు. తాను టోంక్ నియోజకవర్గ ఎమ్మెల్యేను అని ఖాతాలో అప్డేట్ చేశారు.
బీజేపీ వలలో పైలట్ : గెహ్లాట్
సీఎల్పీ సమావేశంలో పైలట్ తొలగింపునకు సంబంధించి నిర్ణయం తీసుకున్న తర్వాత వెంటనే సీఎం గెహ్లాట్ గవర్నర్ కల్రాజ్మిశ్రాతో భేటీ అయ్యారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రెబల్ నేత పైలట్ బీజేపీ చేతుల్లో ఆటవస్తుగా మారారని విమర్శించారు. మధ్యప్రదేశ్లో అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకున్నట్లుగా ఇక్కడ కూడా చేయాలని బీజేపీ కుట్రలు పన్నుతున్నదనీ, అయితే ఆ పార్టీ ప్రయత్నాలు రాజస్థాన్లో సాధ్యం కావన్న విషయం గుర్తెరగాలన్నారు. ' సచిన్ పైలట్ చేతుల్లో ఏమీ లేదు. బీజేపీ చేసిన ఏర్పాట్లకు అనుగుణంగా ఆయన ఆటలు అడుతున్నారు' అని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బిజెపి నేతలు సమావేశమయ్యారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి జాతీయ జాయింట్ సెక్రెటరీ వి.సతీష్, రాష్ట్ర బిజెపి శాఖ అధ్యక్షుడు సతీష్ పునియా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా, ఉప నేత రాజేంద్ర రాథోర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
పైలట్ గ్రూపులో 16 మంది..
మరోవైపు బలనిరూపణలో భాగంగా తమ గ్రూప్ ఎమ్మెల్యేలకు సంబంధించిన వీడియోను సచిన్ పైలట్ వర్గం సోమవారం రాత్రి విడుదల చేసింది. పైలట్కు చెందిన అధికారిక వాట్సాప్ గ్రూప్ దీన్ని షేర్ చేసింది. ఆ వీడియోలో 16 మంది ఎమ్మెల్యేలు ఒక చోట కూర్చున్నట్టుగా ఉంది. సోమవారం కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరిగిన అనంతరం పైలట్ గ్రూప్ ఈ వీడియోను విడుదల చేయడం గమనార్హం. సీఎల్పీ సమావేశానికి 122 మందికి 106 ఎమ్మెల్యేలు హాజరైనట్టు పార్టీ వర్గాలు పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా పైలట్ వర్గం విడుదల చేసిన వీడియోను ఆయన గ్రూపునకు చెందిన విశ్వేంద్ర సింగ్ ట్విట్టర్లో పోస్టు చేశారు. 'ఫ్యామిలీ' అనే ఒక క్యాప్షన్ను కూడా ఉంచారు.
బీజేపీది ప్రభుత్వాలను కూల్చేపనే : శివసేన
రాజస్థాన్ సంక్షోభం నేపథ్యంలో బీజేపీ తీరుపై శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ ప్రతిపక్ష పార్టీలకు చెందిన రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూల్చడాన్నే పనిగా పెట్టుకుందని శివసేన అధికార పత్రిక సంపాదకీయ విమర్శించింది. 'ఒక ఎడారి రాష్ట్రంలో మీ రాజకీయ దుష్ట కుతంత్రాలతో ఏం సాధించాలనుకుంటున్నారు.. మీరు వేస్తున్న అడుగులు దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఎడారిగా మార్చే ప్రమాదం ఉంది' అని హెచ్చరించింది.