Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-బెడ్పైనే రోజంతా మృతదేహం
- వార్డు ఖాళీచేసిన తోటి కరోనా పేషెంట్లు
- పట్టించుకొనే నాధుడు కరువు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సర్కారు దవాఖానాల్లో కరోనా రోగుల పట్ల అమానుష ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. గాంధీ ఆస్పత్రిలో జర్నలిస్ట్ మనోజ్ మరణం అక్కడి అమానవీయ కోణాలను బయటి ప్రపంచానికి వెల్లడించింది. ఛాతీ ఆస్పత్రిలో వెంటిలేటర్ పెట్టమని ప్రాధేయపడినా పట్టించుకోని దైన్యం కనిపించింది. ప్రభుత్వం మాత్రం కరోనా వైద్యంపై నభూతో నభవిష్యత్ అన్ని స్వోత్కర్ష చేసుకుంటున్నది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నట్టు తెలుస్తున్నది. తాజాగా గాంధీ ఆస్పత్రిలో శ్రీనివాస్ అనే కరోనా రోగి మంగళవారం ఉదయం మరణించారు. రాత్రి ఎనిమిదిగంటలు దాటినా ఆ మృతదేహాన్ని బెడ్ మీది నుంచి తరలించలేదు. బెడ్మీద శ్రీనివాస్ మృతదేహం అత్యంత దయనీయంగా పడి ఉంది. కనీసం అతని ఒంటిపై నుంచి వైద్య పరికరాలను కూడా సిబ్బంది తొలగించలేదు. మరణించిన శ్రీనివాస్ కాలికి ఒకే చెప్పుతో బెడ్ మీద పడి ఉన్నారు. కరోనా వస్తే...పేషెంట్ వెంట అటెండెంట్లను అనుమతించ ట్లేదు. అంతా తామై చూసుకుంటామని ప్రభుత్వం భరోసా ఇస్తున్నది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నది. కరోనా ప్రత్యేక ఆస్పత్రుల్లోపల అసలు ఏం జరుగుతుంది... ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు...సౌకర్యాలు ఏంటి...వివిధ స్టేజీల్లో ఉన్న కరోనా పేషెంట్ల పట్ల సిబ్బంది అసిస్టెన్సీ ఎలా ఉన్నది... అనే వివరాలు ఏవీ బాహ్య ప్రపంచానికి తెలియట్లేదు. ప్రధానంగా గాంధీ ఆస్పత్రి పూర్తిగా గతి తప్పుతున్నది. గాంధీలో చేరే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. దానికి తగినట్టు డాక్టర్లు, నర్సులు, సిబ్బంది లేరు. ఉన్నవారిపై అపరిమిత పనిభారం పడుతున్నది. ఫలితంగా వైద్యంలో నాణ్యత, వైద్యులపై విశ్వాసం సన్నగిల్లుతున్నాయని కరోనా వ్యాధిగ్రస్తుల బంధువులు ఆరోపిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో మొన్నటికి మొన్న జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి, ఆందోళనలు నిర్వహించారు. ఆరోగ్యశాఖ మంత్రి జోక్యంతో ఆ వివాదం సద్దుమణిగిందనుకొనే లోపే, కొత్తగా వచ్చిన నర్సింగ్ సిబ్బంది తమను విధుల్లోకి ఎందుకు తీసుకోవట్లేదంటూ రోడ్డుపై బైటాయించి, ఆందోళన నిర్వహించారు. వారి సమస్య పరిష్కారం అయ్యింది అనుకొనేలోపే... ఐదు రోజుల నుంచి గాంధీ ఆస్పత్రిలోని యావత్ అవుట్సోర్సింగ్ సిబ్బంది జేఏసీగా ఏర్పడి ఆందోళనలు చేస్తున్నారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో మంగళవారం ఆస్పత్రి ప్రాంగణం నుంచి బయటకు వచ్చి, రోడ్డుపై బైటాయించారు. ఆందోళనలో ఔట్సోర్సింగ్ సిబ్బంది, నర్సులు, పారిశుధ్య కార్మికులు, సెక్యురిటీ సిబ్బంది సహా అన్ని విభాగాలకు చెందిన వారు ఉన్నారు. ఈ దశలో ఆస్పత్రిలోని కరోనా పేషెంట్లను పట్టించుకొనే నాధుడు లేకుండా పోయాడు. శ్రీనివాస్ ఉదయం మరణిస్తే, రాత్రి 8 గంటల వరకు కూడా బెడ్ మీది నుంచి మృతదేహాన్ని తీయకపోవడంతో, ఆ వార్డులోని కరోనా పేషెంట్లు అంతా ఖాళీ చేసి వార్డు బయటకు వచ్చేశారు. వార్డు మొత్తం విపరీతమైన దుర్వాసన కొడుతున్నదనీ, ఆస్పత్రి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదంటూ కరోనా రోగులు సోషల్ మీడియా ద్వారా మీడియాకు సమాచారం ఇచ్చారు. అత్యంత దయనీయస్థితిలో శ్రీనివాస్ మృతదేహం బెడ్పై పడి ఉండటం, కుటుంబసభ్యులకు కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడంతో తోటి కరోనా రోగులు తీవ్ర మానసిక ఆందోళనకు గురిఅవుతున్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా గాంధీపై ప్రత్యేక దృష్టి పెట్టకుంటే, రోగుల ఇక్కట్లు మరింత పెరిగి, పరిస్థితులు చేయిదాటే ప్రమాదం ఉన్నట్టు ఇంటలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.