Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఛత్తీస్ గఢ్ లోని హస్డియో అరణ్యంపై మోడీ దోస్త్ కన్ను..
- ఇప్పటికే ఒక బొగ్గు గనితో సాగుతున్న విధ్వంసం..
- ఏడేండ్లుగా పోరాడుతున్న అడవిబిడ్డలు
మధ్య భారతాన ఉన్న చిన్న రాష్ట్రం ఛత్తీస్గఢ్. సహజ వనరులను తన గర్భంలో దాచుకున్న ఈ రాష్ట్రానికి నేడు అవే ప్రాణ సంకటం అవుతున్నాయి. వేల కోట్ల టన్నుల ఖనిజాలతో, సహజ సంపదలతో విలసిల్లిన అరణ్యాలను 'అభివృద్ధి పేరిట' కాజేయడానికి కార్పొరేట్ రాబందుల కండ్లు ఆ పచ్చని వనాలపై పడ్డాయి. ఇంకేం.. 'వడ్డించేవాడు మనవాడు అయినప్పుడు..!' అన్న చందంగా, ప్రభుత్వాల అండతో లక్షల ఎకరాల్లో ఉన్న అడవులను మింగడానికి అధునాతన ఆయుధాలతో అడవి బిడ్డల మీద విరుచుకుపడుతున్నాయి. అడ్డొచ్చినవారిని అక్కడికక్కడే నలిపేస్తూ.. అడవికి యజమానులైన లక్షలాది ఆదివాసీలను వనం దూరం చేస్తున్నాయి. దేశంలోనే అత్యంత విస్తారమైన అడవైన హస్డియో అరణ్యంలో బొగ్గు గనుల తవ్వకం పేరిట అదానీ సంస్థ చేస్తున్న విధ్వంసానికి అంతే లేకుండా పోతున్నది. మైనింగ్ ను నిలిపివేయాలని అక్కడి ప్రజలు ప్రధానికి మొరపెట్టుకున్నా.. వారి బాధను పట్టించుకునే నాధుడే లేడు.
రాయపూర్ : ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్న ఛత్తీస్ గఢ్ లో భారతీయ మూలవాసుల్లో ఒకరుగా పిలువబడుతున్న గోండుల మనుగడకే ముంపు ఏర్పడింది. హస్డియో అరణ్యంలో నివసిస్తున్న వీరిని అక్కడినుంచి వెళ్లగొట్టడానికి, వారి సంస్కతీ సంప్రదాయాలను నాశనం చేయడానికి ప్రధాని మోడీ ఆప్తమిత్రుడు అదానీ నేతత్వంలో ఉన్న అదానీ మైనింగ్స్ కుట్రలు పన్నుతున్నది. గోండులను అక్కడినుంచి వెళ్లగొట్టి వేల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదను కాజేయడానికి 2013 నుంచి నిర్విరామంగా ప్రయత్నిస్తూనే ఉన్నది. ఈ క్రమంలో పచ్చని అడవుల్లో బాంబుల మోత మోయిస్తూ హరిత హనానికి పాల్పడుతున్నది. సకల వక్ష, జంతు, జీవ జాతులు సమ్మిళితంగా నివసిస్తున్న హస్డియో అరణ్యంపై కన్నేసి.. మొత్తం ఆ ప్రాంతాన్నే కబళించివేస్తున్నది. అమాయక ఆదివాసీలకు సేవ చేస్తున్నట్టు నటిస్తూ మొత్తం అడవిని కాజేయడానికి కంకణం కట్టుకున్నది. ఏడేండ్లుగా సాగుతున్న ఈ పోరులో.. అదానీ మైనింగ్ కంపెనీ కుట్రలను ముందునుంచీ ఆదివాసీలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కార్పొరేట్ శక్తుల కుతంత్రాలు తిప్పి కొట్టడానికి వారు అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ పోరాటంలో 'తమ రాజకీయ అవసరాల కోసం' అన్నీ తానై వ్యవహరించిన ఆనాటి ప్రతిపక్ష కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించినా గోండులు మాత్రం పోరును ఆపేదిలేదని అంటున్నారు.
ఖనిజాల గని హస్డియో
మధ్య భారతాన.. ఉత్తర ఛత్తీస్ గఢ్ లో 3 జిల్లా(సర్గుజా, సూరాజపూర్, కొర్బ)ల్లో లక్షా డెబ్బయి వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న అభయారణ్యం హస్డియో. వందలాది ఆదివాసీ జాతులకు ఈ అడవి అమ్మలాంటిది. ముఖ్యంగా గోండులకు ఈ ప్రాంతం పుట్టినిల్లు. వందలాది ఆదివాసీ గూడేలు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నాయి. ఉత్తర భారతంలో ప్రముఖ నదిగా పేరుగాంచిన మహానది కి ఉపనది అయిన హస్డియో నది.. ఇక్కణ్నుంచే ప్రయాణిస్తుంది. ఈ అరణ్యంలో వేల కోట్ల టన్నుల బాక్సయిట్, మాంగనీసు, బొగ్గు, సున్నపురాయి నిల్వలు ఉన్నాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఇక్కడ 5 వేల బిలియన్ టన్నుల బొగ్గునిల్వలు ఉన్నాయని తేలింది. ఇందులో భాగంగా 2012 లోనే 30 బొగ్గు బ్లాకులను గుర్తించారు. అందులో పర్సా ఈస్ట్ కంట బాసన్ (పీఈకేబీ) బ్లాక్ ను 2013 లో (రమణ్ సింగ్ నేతత్వంలోని బీజేపీ సర్కారు) అదానీ మైనింగ్ కు అప్పగించారు.
2013 నుంచే కార్యకలాపాలు..
బీజేపీ సర్కారు ఇచ్చిన అండతో మైనింగ్ కింగ్ గా పేరున్న అదానీ.. హస్డియోలో బొగ్గు తవ్వకాన్ని 2013 లో ప్రారంభించారు. అప్పట్నుంచే హస్డియో నదీ పరివాహక ప్రాంతమంతా రంగు మారింది. భారీ వక్షాలు నేలకొరిగాయి. చెరువులు, సెలయేళ్ళు మాయమయ్యాయి. పర్యావరణం దెబ్బతిన్నది. జంతు, జీవ జాలానికి కష్టాలు మొదలయ్యాయి. బొగ్గు బ్లాక్ కు సమీపం లో ఉన్న ఫతేపూర్, హరిహరాపూర్, సాల్హై, మదనపూర్ తో పాటు మరో 20 గ్ర్రామల ప్రజలకు జీవనోపాధి కరువయింది.
సంస్కృతీ సాంప్రదాయాల విధ్వంసం..
అడవుల విధ్వంసంతో పాటు ఆదివాసీల సంస్కృతిని అదానీ కాలరాస్తున్నారు. స్వతహాగా ప్రకృతి ఆరాధకులైన గిరిజనుల గ్రామాల్లో హిందూ దేవుళ్లను పూజించేలా కార్యక్రమాలను విస్తరింపజేస్తున్నారు. ఇందులో భాగంగానే కొన్నాండ్లుగా అక్కడ గణేష్ చతుర్థిని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దీనికి ఆయన సంస్థ నుంచే భారీగా విరాళాలు అందుతున్నాయి. ఒక్క గణేష్ చతుర్థే గాక ఆదివాసులకు అలవాటులేని పండుగలనూ అక్కడ నిర్వహిస్తూ.. వారి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నారు. మరోవైపు అదానీ ఫౌండేషన్ పేరిట మైనింగ్ జరుగుతున్న చుట్టుపక్కల గ్రామాల్లో సేవా కార్యక్రమాలను చేపట్టారు. నిరసనలు జరుగుతున్న గ్రామాల్లో సంస్థ పేరు మీద నీటి పంపులు వేయించడం, ఆదివాసీ పిల్లలకు చదువు చెప్పించడం, యువకులకు నైపుణ్య శిక్షణ పేరు చెప్పి అక్కడ ఆందోళనలను చల్లబరుస్తున్నారు.
స్వయం సమృద్ధి గ్రామాలు కాస్తా..
సహజ వనరులతో ఒకనాడు స్వయం సమద్ధిగా విలసిల్లిన ఆదివాసీ గ్రామాలు కాస్తా ఇప్పుడు బతుకు జీవుడా అంటూ వలసలు పోతున్నాయి. అడవిలో తమకు దొరకనిదంటూ ఏమీ ఉండకపోయెదనీ, ఒక ఉప్పుకు తప్ప తాము బయటకు రాకపోయేదని మదనపూర్ కు చెందిన అరవై ఏండ్ల రాంనాథ్ శ్యామ్ అన్నారు. హస్డియో నదిలో చేపలు పట్టి, అడవుల్లో దొరికే పండ్లు తీస్కొని.. వాటిని సమీప గ్రామాల్లో జరిగే వారాంతపు సంతల్లో అమ్మేవాళ్లమని ఆయన చెప్పారు. కానీ అదానీ సంస్థ చేస్తున్న మైనింగ్ తో అడవుల్ని నరికివేశారనీ, నది రంగు మారడంతో అందులోని జలాచరాలన్నీ చనిపోతున్నాయని ఆందోళన చెందారు. అడవిలోకి అదానీ వచ్చాక ఈ ప్రాంతాన్ని శవాల దిబ్బ మాదిరిగా చేశారని ఆయన ఆరోపించారు.
పెరుగుతున్న 'ప్రమాదాలు'....
అదానీ సంస్థ ఇక్కడ లభ్యమవుతున్న బొగ్గును రాష్ట్ర రాజధాని రాయపూర్ లో ఉన్న కంపెనీలకు సరఫరా చేస్తున్నది. ఈ క్రమంలో రాజధానినించి ఇక్కడికి రైలు మార్గం వేయాలని ప్రయత్నిస్తున్నా.. గిరిజనులు, హక్కుల సంఘాల ఆందోళనతో అది కార్యరూపం దాల్చలేదు. దీంతో భారీ ట్రక్కులతో బొగ్గును రవాణా చేస్తున్నారు. రేయి పగలూ తేడా లేకుండా తిరిగే ట్రక్కుల కింద వందల సంఖ్యలో గిరిజనులు ప్రాణాలు విడిచారని హరిహరాపూర్ కు చెందిన గ్రామ ప్రతినిధి బాలసాయి కొర్రమ్ తెలిపాడు. ఇక రోడ్డు ప్రమాదాల భారిన పడుతున్న జంతువుల సంఖ్యకు లెక్కేలేదు.
హ్యాండిచ్చిన కాంగ్రెస్
హస్డియో అడవి ఆదివాసులకు ప్రాణాధారం. అదానీకి అప్పగించిన బొగ్గు గనుల పనులను రద్దు చేయాలని కోరుతూ ఇక్కడి వందలాది ఆదివాసీ గూడేల ప్రజలు 2013 నుంచే ఆందోళనలు చేస్తున్నారు. ఇది వారికి జీవన్మరణ సమస్య. ఇందులో భాగంగా అడవిని రక్షించు కోవడానికి గాను.. హస్డియో అరణ్య బచావో సంఘర్ష్ సమితి (హెచ్ఏబీఎస్ఎస్) ఆద్వర్యంలో నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రెండేండ్ల తర్వాత ఈ పోరాటానికి కాంగ్రె స్ మద్దతునిచ్చింది. 2015 లో మదనపుర్ కు వచ్చిన అప్పటి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. 'కాంగ్రెస్ పార్టీ, నేనూ మీతో ఉన్నాం' అని ఆదివాసుల పోరాటానికి మద్దతు ప్రకటించారు. కొన్ని రోజులపాటు గిరిజనులు చేసిన నిరసనలకు కాంగ్రెస్ మద్దతునించింది. కానీ 2018 లో బీజేపీ ప్రభుత్వం కూలిపోయి భూపేష్ బాఘెల్ నేతత్వంలోని కాంగ్రెస్ అక్కడ అధికారాన్ని చేప ట్టింది. రెండేండ్లు కావస్తున్నా అదానీ సంస్థ కార్యకలాపాలు ఆగకపోగా, మధ్యలో కొద్దిరోజులపాటు నిల్చిన ట్రక్కుల రవాణా మళ్లీ ప్రారంభమైనది. దీనిపై హెచ్ఏబీఎస్ఎస్ కో-కన్వీనర్ జయనందన్ సింగ్ స్పందిస్తూ.. 'కాంగ్రెస్ మీద ఉన్న కొద్దిపాటి నమ్మకం కూడా మాకు పోయింది. వాళ్ళు మా హక్కులను కాలరాశారు' అని తెలిపాడు.
పోరు ఆపని గిరిజనం...
అండగా ఉంటామని చెప్పిన రాజకీయ నాయకులు ఎప్పటిలాగే మోసం చేసినా.. సేవా కార్యక్రమాలు పేరిట దోపిడీని విస్తరిస్తున్న అదానీ సంస్థకు వ్యతిరేకంగా ఆదివాసులు పోరాటం ఆపలేదు. అడవితోనే తమకు మనుగడ అంటూ.. కార్పొరేట్లకు వ్యతిరేకంగా తిరిగి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. మధ్యలో కొంత విరామం ఇచ్చినా.. ఇటీవలే మళ్ళీ నిరసనలు ఉధతమవుతున్నాయి. గ్రామ పంచాయతీల అధికారాల ద్వారానే బొగ్గు బ్లాకుల అక్రమాలను అరికట్టగలమని గ్రహించి.. స్థానిక పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన నిరసనకారులను ఓడించడానికి అదానీ ప్రతినిధులు తీవ్ర కుట్రలు పన్నారు. వారి అనుయాయుల ద్వారా లక్షలాది రూపాయలను ఖర్చు చేయించారు. అయినా చాలా గ్రామాల్లో గిరిజనులు తమవారిని గెలిపించుకున్నారు. గెలిచినా ప్రతినిధులలో.. మైనింగ్ ను రద్దు చేయాలని కోరుతూ 9 గ్రామాల సర్పంచ్ లు ఇటీవలే మోడీకి లేఖ రాశారు. అటు రాజకీయంగా, ఇటు అస్తిత్వ పోరాటాల ద్వారా తమ అడవిని రక్షించుకుంటామనీ, ప్రాణాలు పోయినా వెనక్కి తగ్గబోమని ఆదివాసీలు స్పష్టం చేస్తున్నారు.