Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో ప్రేక్షకుల్ని విశేషంగా అలరించి తెలుగునాట తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న అగ్రకథానాయిక అనుష్క. అంతేకాదు ప్రయోగాత్మక మహిళా ప్రధాన చిత్రాలకు కేరాఫ్గా నిలిచి, అగ్ర హీరోలకు దీటుగా తన సినిమాల కోసం ప్రేక్షకులను వేచి చూసే స్థాయికి ఎదిగిన కథానాయిక కూడా. భవిష్యత్లోనూ తన సినీ ప్రస్థానం వెండితెరకే పరిమితం కావాలనే ఉద్దేశంతో ఇటీవల ఓ వెబ్ సిరీస్ కోసం ఇచ్చిన భారీ ఆఫర్ని సైతం అనుష్క సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సంస్థ పలు భాషల్లో నిర్మించబోయే ఓ వెబ్ సిరీస్ కోసం అనుష్కను సంప్రదించింది. అలాగే ఈ వెబ్ సిరీస్లో నటించినందుకు భారీ మొత్తంలో పారితోషికాన్ని ఇచ్చేందుకు కూడా నెట్ఫ్లిక్స్ సిద్ధమైంది. అయితే వెబ్ సిరీస్లో నటించడం ఆసక్తి లేదని, సినిమాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నానని అనుష్క తెలిపినట్టు సమాచారం.
అనుష్క నటించిన తాజా చిత్రం 'నిశ్శబద్దం'. తెలుగుతోపాటు మరికొన్ని భాషల్లోనూ విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా కరోనా లాక్డౌన్ వల్ల థియేటర్లు మూతపడటంతో వాయిదా పడింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా కూడా ఓటీటీ వేదిక రిలీజ్ అవ్వబోతోందనే వార్తలు వినిపించాయి. అయితే వీటిని చిత్ర బృందం ఖండించింది. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోనే విడుదల చేస్తామని ఖరాఖండిగా తెలిపింది. ఇదిలా ఉంటే, పాపులర్ తమిళ నటుడు విజరు సేతుపతికి జోడిగా ఓ ద్విభాషా చిత్రంలో అనుష్క నటించబోతోందనే వార్తలు కూడా ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కె.ఎల్.విజరు దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రం త్వరలోనే సెట్స్పైకి వెళ్ళనున్నట్టు తెలుస్తోంది. కథ మొత్తం అనుష్క చుట్టూనే తిరిగే ఈ సినిమా ఆమె పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందట. గతంలో దర్శకుడు కె.ఎల్.విజరు దర్శకత్వంలో తెరకెక్కిన 'నాన్న' చిత్రంలో అనుష్క నటించిన విషయం విదితమే. కమల్హాసన్, గౌతమ్మీనన్ కాంబినేషన్లో విడుదలైన 'రాఘవన్' చిత్రం అటు తమిళంలోను, ఇటు తెలుగులోనూ విశేష ప్రేక్షకాదరణతో సంచలన విజయం సాధించింది. ఈ చిత్ర సీక్వెల్లో కమల్హాసన్ సరసన అనుష్క నటించనున్నట్టు తెలుస్తోంది. అలాగే గోపీచంద్, తేజ కాంబోలో తెరకెక్కబోయే 'అలువేలు మంగ వేంకటరమణ' సినిమాలోనూ అనుష్క నటించనున్నట్టు బాగా వినిపిస్తోంది.