Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్, దీపికా పదుకొనె జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ సినిమా రూపొందుతున్న విషయం విదితమే. దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు వైజయంతి సంస్థ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ఈ చిత్రంతో చాలా కాలం తర్వాత ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహ్మాన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పలువురు సంగీత దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ పైనల్గా చిత్ర బృందం రెహ్మాన్ ఎంచుకున్నట్టు సమాచారం. అంతేకాదు అక్షరాల 4 కోట్ల రూపాయల భారీ పారితోషికాన్ని కూడా రెహ్మాన్కి ఇవ్వబోతున్నారనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ గ్యాంగ్ తనకు బాలీవుడ్లో అవకాశాలు రాకుండా చేస్తున్నాయని ఇటీవల రెహ్మాన్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసిన విషయం విదితమే. నటీనటుల అవకాశాల విషయంలో నెపోటిజం ఎంతగా ఎఫెక్ట్ చూపిస్తుందో, అలాగే ఈ గ్యాంగ్ వల్ల తనలాంటి వాళ్ళకి అవకాశాలు లేకుండా చేయడంలో ముఖ్యభూమిక పోషిస్తోందని రెహ్మాన్ బాహాటంగా చెప్పడంతో బాలీవుడ్లో సంగీత పరిశ్రమ ఎలాంటి దుస్థితిలో ఉందనే విషయం అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ప్రాజెక్ట్లోకి రెహ్మాన్ ఎంట్రీ ఇవ్వడం వల్ల మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ కథానాయిక దీపికా పదుకొనె ఈ చిత్రంలో నటిస్తుండటంతో అందరిలోనూ ఈ సినిమాపై అమితాసక్తి పెరిగింది. టైమ్ బేస్డ్ కాన్సెప్ట్తో రూపొందబోయే ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో దీపికాతోపాటు మరో కథానాయిక కూడా నటించే అవకాశం ఉందట. ఆ కథానాయికని కూడా బాలీవుడ్ నుంచే ఎంపిక చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని వినిస్తోంది. ప్రభాస్ ఇప్పటికే 'రాధేశ్యామ్' సినిమాలో నటిస్తున్న విషయం విదితమే. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.