Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో, హీరోయిన్లుగా తర్వాత అన్నాచెల్లెళ్ళుగా కూడా నటించి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన ఎంతో మంది స్టార్ హీరో, హీరోయిన్ల కాంబినేషన్లని మనం చూశాం. అయితే ఈ జాబితాలోకి హీరో విష్ణు, హీరోయిన్ కాజల్ కూడా రాబోతున్నారు. వీరిద్దరూ లేటెస్ట్గా నటిస్తున్న హాలీవుడ్- ఇండియన్ ప్రాజెక్ట్ 'మోసగాళ్ళు'. ఈ చిత్రంలో అన్నాచెల్లెళ్ళుగా మంచు విష్ణు, కాజల్ నటిస్తున్నారు. ఈ విషయాన్ని రాఖీ పండుగ నేపథ్యాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే ఓ పోస్టర్ని కూడా విడుదల చేసింది. ఇప్పటివరకు నాయకానాయికలుగా మ్యాజిక్ చేసిన వీరిద్దరూ అన్నాచెల్లెళ్ళుగా నటించడమనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ మీద మరింత ఆసక్తితోపాటు అంచనాలనూ పెంచింది. చరిత్రలో నమోదైన అతి పెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్శెట్టి, రుహీ సింగ్, నవీన్ చంద్ర, నవదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్పై మంచు విష్ణు నిర్మిస్తుండగా, ఏవీఏ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ వేసవిలో విడుదల కావాల్సిన ఈచిత్రం కరోనా లాక్డౌన్ వల్ల వాయిదా పడింది. త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించనుంది.